తమిళనాడులో ఓ మయాలేడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురు పురుషులను మోసం చేసింది. ఆమె బాధితుల్లో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వున్నారు.
గతేడాది ఓ వ్యక్తి 27 మంది మహిళలను పెళ్లి చేసుకుని మోసగించిన వార్త వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు.. ఈ సీన్ రివర్స్ అయ్యింది. ఒక మహిళ చాలా మంది పురుషులను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మహిళ ఒక డాక్టర్, ఒక వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్ , ప్రైవేట్ సంస్థ మార్కెటింగ్ హెడ్తో సహా అనేక మంది పురుషులపై కన్నేసింది. ఆమె లీలలు పోలీసుల దాకా వెళ్లడంతో మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కిలాడీ లేడీ పరారీలో వుంది. ఈ కేసును సిటీ పోలీసులు.. సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేయాలని చెన్నై సిటీ పోలీస్ కమీషనర్ సిబ్బందిని ఆదేశించారు.
కిలాడీ లేడీని మంజుల వీ (40)గా గుర్తించారు. ఈమె చెన్నైలోని మైలాపూర్ నివాసి. అప్పటికే ఆమెకు వివాహమై మైలాపూర్లోని ఓ ఇంట్లో ఉంటోందని పోలీసులు తెలిపారు. సతీశ్ కుమార్ అనే వ్యాపారి మంజుల తనపై వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ మైలాపూర్లో ఓ సంస్థ నడుపుతోందని, సోషల్ మీడియా వేదికగా తనతో స్నేహం పెంచుకుందని సతీష్కుమార్ పేర్కొన్నాడు. ఆమె అతనికి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా సందేశాలు పంపడం ప్రారంభించిందని వ్యాపారవేత్త తెలిపాడు.
మంజుల తనకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్ ద్వారా తనకు పంపిందని సతీష్ వెల్లడించారు. అంతేకాదు ఆ ఫోటోలను మంజుల అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేసింది. సతీష్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్, 2000లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా మంజుల భర్త, ఆమె కుమార్తె.. ఆమె చాలామందిని మోసం చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా.. గతేడాది బిభూ ప్రకాష్ స్వైన్ అనే మోసగాడు దేశవ్యాప్తంగా 18 మంది మహిళలను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అతని బాధితుల్లో ప్రొఫెసర్లు, లాయర్లు, మెడిక్స్ , పారామిలటరీ అధికారులు వున్నారు. తనను తాను డాక్టర్లా నమ్మించి వారిని పెళ్లాడాడు.
