లైంగిక దాడి జరిగిన మగాళ్లూ బాధితులే : కేంద్ర మంత్రి మేనకా గాంధీ
రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన మంత్రి
లైంగిక వేధింపులకు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా గురవుతున్నారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. అందువల్ల మహిళలు లైంగిక వేధింపులకు గురయినపుడు ఎలాగైతే బాధితులుగా పరిగణిస్తున్నారో, పురుషులను కూడా అలాగే గుర్తించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాధికారులకు లేఖలు రాశారు.
ఫోక్సో చట్టం అందరికి సమానంగా వర్తిస్తుందని, ఇందులో లింగ బేదం లేకుండా బాలబాలికలకు సమాన రక్షణలున్నాయని మంత్రి తెలియజేశారు. అందువల్ల లైంగిక దాడికి గురైన మగ పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె సూచించారు.
ఇక అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న వరకట్నాన్ని ఆదారంగా చేసుకుని కొన్ని వెబ్ సైట్లు పనిచేస్తున్నాయని అన్నారు. అలా వరుడి విద్యార్హతలు,ఆధాయం, కులం ఆధారంగా ఎంత కట్నం ఇవ్వాలో లెక్కించే వెబ్ సైట్ల పై చర్యలు తీసుకోవాలని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరారు. దీనిపై మేనకా గాంధీ ఓ లేఖను రవిశంకర్ ప్రసాద్ కు రాశారు.