సోమవారం నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైళ్లు.. మాస్క్, స్మార్ట్కార్డ్ లేకపోతే నో ఎంట్రీ
అన్లాక్ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్ల సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
అన్లాక్ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్ల సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రయాణికులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు కార్పోరేషన్లు అనుసరించాల్సిన విధి విధాలను పేర్కొంది. మెట్రో రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడు ముఖానికి మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కంటైన్మెంట్ జోన్ల వద్ద వున్న మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఆదేశించింది. స్టేషన్లలో , ఫ్లాట్ ఫాంలపైనా, మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించాలని.. అందుకు తగిన విధంగా మార్కింగ్ చేయాలని సూచించింది.
మాస్కులు లేకుండా ఏ ఒక్కరినీ మెట్రో స్టేషన్లకి గానీ, రైళ్లలోకి గానీ అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి లక్షణాలు లేని వారిని, శరీర ఉష్ణోగ్రత పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించాలని పేర్కొంది.
ఎంట్రీ, ఎగ్జిట్ డోర్లు, లిఫ్టులు, ఎస్క్లేటర్లు సహా అన్ని ప్రదేశాల్లో శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. నేరుగా డబ్బులు చెల్లించే పద్ధతులు నిలిపివేయాలని, స్మార్ట్కార్డులు, ఆన్లైన్ బుకింగ్కు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది.
ప్రయాణికులు తక్కువ లగేజీతో రావాలని.. అలాగే రైళ్లలో ఏసీ సరఫరా, గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. మెట్రో రైలు కార్పోరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కేంద్రం కోరింది.