కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సొంతంగా కారు వున్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులను కట్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొన్ని వర్గాలకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చింది. 

ప్రజాకర్షక పథకాలను హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ వాటి అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తాజాగా సిద్ధూ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 

రేషన్ కార్డుదారులలో అనర్హులను ఏరివేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా సొంతంగా కారు వున్న కుటుంబాలకు బీపీఎల్ కార్డును రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రజలు భగ్గుమంటున్నారు. ఇంట్లో వైట్ బోర్డు కారు వుంటే బీపీఎల్ కార్డుకు అనర్హులని, ఇప్పటికే వున్న కార్డులను తొలగిస్తామని కర్ణాటక పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప పేర్కొన్నారు. అయితే ఉపాధి కోసం కారును కొనుగోలు చేసిన కుటుంబాలకు ఈ విషయంలో మినహాయింపు వుంటుందని మంత్రి వెల్లడించారు. 

ఇకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా బీపీఎల్ కార్డుదారులకు ప్రస్తుతం 5 కిలోల బియ్యం అందిస్తుండగా, మరో 5 కిలోలకు సంబంధించి నగదును అందజేస్తున్నామని మునియప్ప చెప్పారు. సెప్టెంబర్ నెల నుంచి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి అవసరమైన బియ్యాన్ని సేకరించేందుకు ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి వివరించారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మునియప్ప పేర్కొన్నారు.