క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళకు, డ్రైవర్, ప్రయాణికుల వేధింపులు.. పదినెలల చిన్నారిని తోసేసి, హత్య...
మహిళను వేధించి, ఆమె పదినెలల చిన్నారిని క్యాబ్ లోంచి నెట్టేసి.. చనిపోవడానికి కారణమయ్యాడో క్యాబ్ డ్రైవర్, తోటి ప్రయాణీకులు.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని పాల్ఘర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాబ్ లో వెళుతున్న ఓ మహిళ మీద అ డ్రైవర్తో పాటు మరో ప్రయాణికులు వేధించారు. వేధింపులకు పాల్పడడమే కాకుండా పది నెలల ఆమె చిన్నారిని కారులో నుంచి బయటకు విసిరేశారు. ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పెల్హర్ నుంచి పోషీర్ కు తన 10 నెలల కూతురుతో కలిసి ఓ క్యాబ్ లో ప్రయాణిస్తోంది. కొంచెం దూరం వెళ్ళిన తరువాత క్యాబ్ డ్రైవర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
దీనికి తోటి ప్రయాణికులు కూడా తోడయ్యారు. ఆమె దీనిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ ప్రతిఘటనతో నిందితులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. క్యాబ్ వేగంగా ప్రయాణిస్తూ ఉండగా అందులో నుంచి ఆమె చేతిలో ఉన్న చిన్నారిని లాక్కుని బయటికి తోసేశారు. కారులో నుంచి వేగంగా బయటపడిన ఆ పాప అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత నిందితులు ఆ మహిళలు కూడా కారులో నుంచి గట్టిగా బయటికి తోసేశారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ అమానుష ఘటన మండ్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగింది.
ఆ తరువాత అక్కడ స్థానికులు ఆమెకు కాపాడి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు...ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి (34) తన భార్య(30)ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. రెండోసారి సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. నిందితుడు సోమవారం రాత్రి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు.
ఆ తరువాత అదే రాత్రి మరోసారి భార్యను సెక్స్ కావాలని అడిగాడు. అయితే, దీనికి ఆమె నిరాకరించింది. దీంతో భార్య మీద కోపానికి వచ్చాడు. తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసుల ముందు వీడియో స్టేట్మెంట్లో మహ్మద్ అన్వర్ అనే ఆ నిందితుడు అంగీకరించాడు. భార్యను హత్య చేసిన తరువాత మృతదేహాన్ని పాలిథిన్ సంచిలో వేసి ఇంటికి 50కిలోమీటర్ల దూరంలో పడేశాడు. తెల్లారి తన భార్య కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గత మంగళవారం ఠాకూర్ద్వారాలోని రతుపురా గ్రామ సమీపంలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఠాకూర్ద్వారా పోలీస్ స్టేషన్లో హత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత, వారు తమ దర్యాప్తులో భాగంలో సమీపంలోని పోలీస్ స్టేషన్లకు మృతదేహానికి సంబంధించిన ఫొటోలను పంపించారు. అమ్రోహాలో దాఖలైన మిస్సింగ్ ఫిర్యాదుతో వివరాలు సరిపోలడంతో, మొరాదాబాద్ పోలీసులు మృతదేహాన్ని గుర్తించడానికి అన్వర్ను పిలిచారు. విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.