ఉత్తరప్రదేశ్లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు ఓ బిజినెస్ మ్యాన్ ఆఫీసులోకి చొరబడ్డారు. అందులో ఓ దొంగ బిజినెస్ మ్యాన్కు గన్ పాయింట్ చేశాడు. మిగతా దొంగలు సంచులను తీసి దోచుకోవడం మొదలు పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే చోరీ పూర్తి చేసుకుని పరారయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో సినీ ఫక్కీలో ఓ చోరీ జరిగింది. ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి ఓ వ్యాపారి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఇద్దరు ఇనుప రాడ్లతో ఆ ఆఫీసులోకి వెళ్లారు. ఒకరు గన్ చేతిలో పట్టుకుని అడుగు పెట్టాడు. ఆఫీసులోకి వెళ్లగానే ఒక దొంగ గన్ చేతిలో పట్టుకుని బిజినెస్ మ్యాన్కు గురి పెట్టాడు. అంతే... మిగతా ఇద్దరు వెంటనే సంచులు తీసి టేబుల్ ర్యాకుల నుంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారు. సుమారు రూ. 6 లక్షల డబ్బు దొంగిలించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్లోని కల్నల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారికి కార్యాలయం ఉన్నది. ఈ కార్యాలయంలో దోపిడీ చేయడానికి ముగ్గురు దుండగులు పక్కా ప్రణాళిక ప్రకారం సినీ ఫక్కీలో చోరీ చేశారు. వాళ్లను గుర్తించకుండా ముఖానికి మాస్కులు పెట్టుకున్నారు. ఆ కార్యాలయంలోకి ఎంటర్ కాగానే ఒక దుండుగుడు బిజినెస్ మ్యాన్కు గన్ పాయింట్ చేశాడు. ఆ బిజినెస్ మ్యాన్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆ కార్యాలయంలో ఉన్నారు. బిజినెస్ మ్యాన్తోపాటు ఆ ఇద్దరు కూడా గన్ చూడగానే ఒక్కసారిగా భీతిల్లిపోయారు. బిజినెస్ మ్యాన్ చేతులు పైకి లేపి భయపడుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.
ఆ దొంగ గన్ చూపిస్తుండగానే.. మిగతా ఇద్దరు దొంగలు చోరీ పని మొదలు పెట్టారు. తమ వెంట తెచ్చుకున్న సంచులను ఓపెన్ చేశారు. టేబుళ్ల ర్యాకులు, ఇతర చోట్ల తనిఖీలు చేసి డబ్బును వేగంగా తమ సంచుల్లో కుక్కుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్కు వెళ్లారు. దీనిపై పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేగంగా దర్యాప్తు మొదలు పెట్టినట్టు ప్రయాగ్ రాజ్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తదుపరి ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
