బుందేల్ ఖండ్‌కు చెందిన ఓ పేద రైతుకు  రాత్రికి రాత్రే  అదృష్టం వరించింది. 


బుందేల్ ఖండ్: బుందేల్ ఖండ్‌కు చెందిన ఓ పేద రైతుకు రాత్రికి రాత్రే అదృష్టం వరించింది. తరాల నుండి మైనింగ్ వ్యాపారం చేస్తున్న ఆ కుటుంబానికి ఎట్టకేలకు వజ్రం రూపంలో అదృష్టం కలిసొచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన మోతీలాల్ ప్రజాపతి కుటుంబం తరాలుగా మైనింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.కానీ ఏనాడూ కూడ ఆ కుటుంబానికి మైనింగ్ వ్యాపారం కలిసి రాలేదు. 

మోతీలాల్ కూడ క్రిష్ణ కల్యాణ్‌పూర్ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకొని మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. 2018 సెప్టెంబర్ మాసంలో మోతీలాల్ ప్రజాపతి ఈ భూమిని లీజుకు తీసుకొన్నాడు. నెల తిరిగేలోపుగానే మోతీలాల్ కు అదృష్టం కలిసివచ్చింది. ఈ భూమిలో మైనింగ్ చేస్తుండగా 42.59 క్యారెట్‌ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలుంటుందని అంచనా.

ఈ వజ్రాన్ని విక్రయించి వచ్చిన డబ్బుతో తన పిల్లలను బాగా చదివించుకొంటానని మోతీలాల్ చెప్పారు. ఇల్లు కట్టుకోవడంతో పాటు తన సోదరుడి కూతుళ్లకు కూడ పెళ్లి చేస్తానని ఆయన ప్రకటించారు. నవంబర్ మాసంలో ఎన్నికలు ముగిసిన తర్వాత తాను ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్టు మోతీలాల్ ప్రకటించారు.