కిరాతకంగా భార్యపై బ్లేడుతో దాడి చేసి.. ఆపై భర్త ఆత్మహత్య..
కట్టుకున్న భర్తే ఆమె పాలిట దారుణంగా ప్రవర్తించాడు. సర్జికల్ బ్లేడ్ తో భార్య మెడపై, చెంపలపై క్రూరంగా గాయాలు చేశాడు. భార్య చనిపోయిందని భావించి.. ఇంట్లో నుంచి పారిపోయిన భర్త వేరే ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓ భార్య పట్ల భర్త అతి క్రూరంగా ప్రవర్తించాడు. గొడవల కారణంగా భార్యపై కిరాతకంగా బ్లేడుతో దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి.. అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం బాధితురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఘజియాబాద్ సమీపంలోని నసీబ్ విహార్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ (32) కు పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతానికి చెందిన ఓ మహిళలతో ఇటీవలే వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల తరువాత భర్తలో మార్పు వచ్చింది. చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవల కారణంగా జనవరి 15వ తేదీన భార్య పుట్టింటికి వచ్చి ఉంటోంది.
పుట్టింటికి వచ్చి ఉంటున్న మహిళలను తీసుకువెళ్లేందుకు భర్త రాజ్ కుమార్ జనవరి 19వ తేదీన వచ్చాడు. తిరిగి ఘజియాబాద్ లోని నసీబ్ విహార్ ప్రాంతంలో ఉన్న మ్యాట్రిమోనియల్ హౌస్కి రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అయితే ఆ రాత్రి ఆ ఇంట్లోనే అతడు ఉండిపోయాడు. మరుసటి రోజు కూడా ఆమెను అభ్యర్థించాడు. కానీ దానికి మహిళ ఒప్పుకోలేదు. ఈ సమయంలో బాధితురాలి తల్లి కూడా అక్కడే ఉంది. అయితే అదే రోజు సాయంత్రం ఇద్దరు దంపతులను ఇంట్లో ఒంటరిగా ఉంచి ఆమె తల్లి మార్కెట్ కు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజ్ కుమార్ భార్యపై సర్జికల్ బ్లేడ్ తో క్రూరంగా దాడి చెశాడు. ఆమె మెడ చుట్టూ చెంపలపై అనేక సార్లు తీవ్రమైన గాయాలు చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. భార్య చనిపోయిందని భావించి అతడు ఇంట్లో నుంచి పరారయ్యాడు.
ఇంట్లోకి తిరిగి వచ్చిన మహిళలకు కూతురు అచేతన స్థితిలో పడి ఉండటం గమనించి వెంటనే స్థానిక దీన్ దయాళ్ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఆమెకు తీవ్ర రక్త స్రావం జరగడంతో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో స్థానిక కానిస్టేబుల్ సుధీర్ ఆమెకు రక్తదానం చేశారు. దీంతో డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. పోలీసులకు సమాచారం చేరడంతో వారు హాస్పిటల్ కు చేరుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు యూపీలో ఘజియాబాద్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. ఖాళీగా ఉన్న అతడి బావ ఇంట్లో తలదాచుకుంటున్నట్టు వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.