ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారి లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈడీ డైరెక్టరేట్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్ హోటల్స్ రిసార్ట్స్ చీఫ్ విక్రమాదిత్య సింగ్, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్ లపై కేసులు నమోదయ్యాయి.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతరులపై ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తుంది.
ఇందులో అమన్ దీప్ సింగ్ దాల్ కూడ నిందితుడు. ఈ ఏడాది తొలి నాళ్లలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అమన్ దీప్ సింగ్ ధాల్ కు సహాయం చేసేందుకు పవన్ ఖత్రీ, ఈడీలో క్లర్క్ గా పనిచేస్తున్న నితేష్ కోహర్ ద్వారా రూ. 5 కోట్లు లంచంగా స్వీకరించినట్టుగా దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ధాల్ అతని తండ్రి బీరేందర్ పాల్ సింగ్ ఈడీ దర్యాప్తులో సహాయం కోసం ఈడీ అసిస్టెంట్ ఖత్రీకి రూ. 5 కోట్లు ఇచ్చినట్టుగా ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.
