బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం.. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారు జామున 1.58 నిమిషాలకు ఒక్క సారిగా భూమి కంపించింది. ఢిల్లీతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి ప్రకంపనలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చాలా మందికి ఏమీ అర్థం కాక, భద్రత కోసం అర్ధరాత్రి ఇళ్ల నుండి బయటకు వచ్చారు.
కొన్ని సెకన్ల పాటు ఈ తీవ్రమైన భూకంపం కొనసాగింది. దీని ప్రకంపనలు పొరుగున ఉన్న నోయిడా, గురుగ్రామ్లో కూడా కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం లోతు సుమారు 10 కిలో మీటర్ల రేంజ్ లో ఉంది. ‘‘ 09.11.2022న నేపాల్ కేంద్రంగా భూకంపం 01:57:24 సమయంలో సంభవించింది. దీని తీవ్రత 6.3గా నమోదు అయ్యింది. లాట్: 29.24, పొడవు : 81.06, లోతు : 10 కిలో మీటర్లు’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది.
కాగా.. ఐదు గంటల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. నేపాల్లో బుధవారం రాత్రి 8:52 గంటలకు 4.9 తీవ్రతతో చివరి భూకంపం సంభవించింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.