రోషన్‌ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటోందని అతడు అనుమానం పెంచుకున్నాడు.

తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. అంతే.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తలను, మొండాన్ని వేరు చేసి ఆ తలను పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక కోలారు– చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచార్లపల్లిలో గురువారం జరిగింది. 

శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజీజ్‌ (27) మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. ఇతనికి గతంలోనే పెళ్లయింది. అయితే బెంగళూరుకు చెందిన అయూబ్‌ఖాన్‌ కూతురు రోషన్‌ఖానం (24)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రోషన్‌ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటోందని అతడు అనుమానం పెంచుకున్నాడు.

 ఇక ఆమెను అంతమొందించాలని పథకం వేసుకొని గురువారం చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి పిలుచుకొచ్చాడు. దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్‌లోకి వెళ్లారు. అక్కడ అజీజ్‌ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్‌లో లొంగిపోయాడు.