హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వేదికపై ఆసీనులు అయ్యారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వేదికపై ఆసీనులు అయ్యారు. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీని కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌లు శాలువతో సత్కరించారు. జేపీ నడ్డాను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. పీయూష్ గోయల్‌‌కు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శాలువతో సత్కరించారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇతర బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 350 మందివరకు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా నిలిచింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను మోదీ సిద్దం చేయనున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింతగా పటిష్టం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ పాగా వేయడానికి ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న మోదీకి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తాను హైదరాబాద్ చేరుకున్న విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు. ‘‘బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.