నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ యూపీలోని బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ కారుపై రైతులు దాడికి దిగారు. రమేష్ తికాయత్ అనుచరులే ఈ దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే కారుపై రైతులు దాడికి దిగారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు బీజేపీ ఎమ్మెల్యే కారుపై దాడికి దిగారు.రాష్ట్రంలోని బుధానాకు చెందిన ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ సిసౌలి గ్రామంలో శనివారం నాడు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఎమ్మెల్యే కారుపై బురద, పెయింట్ విసిరారు. కారుపై దాడికి దిగారు. కారు అద్దాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి.

రాకేష్ తికాయత్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేష్ తికాయత్ సోదరుడు నరేష్ తికాయత్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన మనుషులు ఈ దాడి వెనుక ఉన్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైతుల దాడి నుండి ఎమ్మెల్యేను రక్షించినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు చేరుకొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు తమ ఆదాయాన్ని దెబ్బతీస్తాయని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఏడాది నుండి కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉండి నిరసన కొనసాగిస్తున్నారు.