సోనాలి బింద్రే చనిపోయిందన్న బీజేపీ ఎమ్మెల్యే.. నెటిజన్ల ట్రోల్స్
‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ అని రాసుంది. ఇందులోని వాస్తవాన్ని ఎమ్మెల్యే నిర్ధారించుకోకుండానే షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కడంలో బీజేపీ నేతలు ముందు వరసలో ఉంటారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మాయిలను కిడ్నాప్ చేయాలంటూ యువకులకు పిలుపునిచ్చిన ఆయన తాజాగా.. కేన్సర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కన్నుమూసిందంటూ ట్వీట్ చేశారు. వాట్సాప్లో తనకు వచ్చిన మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి దానిని ట్వీట్టర్లో షేర్ చేశారు.
కదమ్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్లో.. ‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ అని రాసుంది. ఇందులోని వాస్తవాన్ని ఎమ్మెల్యే నిర్ధారించుకోకుండానే షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు. రామ్ కదమ్ను నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పుడు వార్తను షేర్ చేసినందుకు ట్రోల్ చేస్తున్నారు. దీంతో స్పందించిన రామ్ కదమ్ తన ట్వీట్ను డిలీట్ చేసి, క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి బింద్రే గురించి వచ్చినదంతా అవాస్తవం. ఆమె త్వరగా కోలుకోవాలని గత రెండు రోజులుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతోంది. తాను కేన్సర్ బారిన పడినట్టు ఈ ఏడాది జూలై 4న ఆమె వెల్లడించింది. విషయం తెలిసి బాలీవుడ్ చిత్రపరిశ్రమ, ఆమె అభిమానులు షాక్కు గురయ్యారు.