UP Assembly Election 2022: యూపీలో కమలానికి మరో షాక్.. బీజేపీకి మరో మంత్రి గుడ్ బై!
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నకల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు బీజేపీకి వరుసగా షాక్ ల మీద షాక్ తగులుతున్నాయి. గురువారం నాడు మరో మంత్రి బీజేపీకి గుడ్ బై చెప్పాడు. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి బీజేపీని వీడిన మంత్రుల సంఖ్య మూడుకు చేరింది.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో రాజకీయా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాష్ట్రం రాజకీయాల్లో ఊహించని విధంగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యూపీలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీకి (BJP) షాక్ ల మీద షాక్ తగులుతూనే ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు కాషాయ పార్టీని వీడి.. వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలోనే గురువారం నాడు ఆయుష్, ఆహార భద్రత మంత్రి ధరం సింగ్ సైనీ (Dharam Singh Saini) బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడిన తొమ్మిదో ఎమ్మెల్యే ధరం సింగ్ సైనీ కావడం గమనార్హం. ఇదే దారిలో మరి కొంత మంది మంత్రులు, కీలక నేతలు ఉన్నారని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో పార్టీని వీడే అంశం ఆ పార్టీలో కలవరం రేపుతున్నది.
కాగా, అంతకుముందు రోజు, ధరమ్ సింగ్ సైనీ (Dharam Singh Saini) తనకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భద్రతను వెనక్కి పంపారు. అలాగే, తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ.. గురువారం నాడు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ధరమ్ సింగ్ సైనీ రాష్ట్ర (స్వతంత్ర బాధ్యత) ఆయుష్, ఆహార భద్రత అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు. క్యాబినేట్ మినిస్టర్ స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైన నిష్క్రమణల పర్వం ఆపై ఊపందుకున్నది. బీజేపీ వీడటం పై స్పందించిన ధరం సింగ్ సైనీ (Dharam Singh Saini) .. దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిన కారణంగానే తాను బీజేపీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, గురువారం ఉదయం బీజేపీకి మరో ఎమ్మెల్యే కూడా గుడ్ బై చెప్పారు. షికోహాబాద్ ఎమ్మెల్యే , బీసీ నేత ముఖేష్ వర్మ (Mukesh Verma) బీజేపీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న బీజేపీ నిష్క్రమణల సంఖ్య ఎనిమిదికి చేరింది. మంత్రి ధరం సింగ్ సైతం గుడ్బై చెప్పడంతో 9కి పెరిగింది. బ్రజేష్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్, ముఖేష్ వర్మ, వినయ్ షాక్యా తదితరులు పార్టీని వీడారు. ఇప్పటివరకు బ్రజేష్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్, ముఖేష్ వర్మ, వినయ్ సఖ్య ఆ పార్టీకి (BJP) రాజీనామా చేశారు. ఇక ధరం సింగ్ సైనీ స్వామి ప్రసాద్ మౌర్యకు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇటీవలే సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియనుంది. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాలకు (UP Assembly Election 2022) ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. యూపీ (UP assembly election)లో తమదే విజయమంటే.. తమదే గెలపు అంటూ ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు 125 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించింది. బీజేపీ కూడా నేడో రేపో అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.