యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక దేహాన్ని ఉంచిన శవపేటికపై జాతీయ జెండాకు అవమానం జరిగిందని కాంగ్రెస్ అభ్యంతరం లేవనెత్తింది. జాతీయ జెండాపై పార్టీ జెండాను ఉంచారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా పలువురు నేతలు సీరియస్ అయ్యారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతిపై బీజేపీ సంతాపం ప్రకటించింది. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు కీలక పార్టీ నేతలు ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం యూపీ రాజధాని లక్నోకు వెళ్లి రాష్ట్ర మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక దేహానికి నివాళులర్పించారు. కళ్యాణ్ సింగ్ విలువైన మానవమాత్రుడని, సమర్థుడైన నాయకుడని ప్రధాని మోడీ అన్నారు. సామాన్య ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ నివాళులర్పించిన తర్వాత కళ్యాణ్ సింగ్ భౌతిక దేహాన్ని ఉంచిన శవపేటికకు పలుమార్పులు జరిగినట్టు తెలుస్తున్నది.
కళ్యాణ్ సింగ్ భౌతికదేహం ఫొటోను బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో శవపేటిక సగభాగం జాతీయ జెండా బయటకు కనిపిస్తున్నది. మిగతా సగభాగంపై బీజేపీ జెండా ఉంచారు. అంటే జాతీయ పతాకంపై బీజేపీ జెండాను ఉంచారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్లో మండిపడ్డారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ట్విట్టర్లో అభ్యంతరాన్ని లేవనెత్తారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా తాను తన గుండెపై చేతి ఉంచారని(జాతీయ గీతాలాపన చేస్తున్నప్పుడు చేతులు కిందకి పెట్టి స్టిఫ్గా అటెన్షన్ మోడ్లో ఉండాలి), అందుకోసం నాలుగేళ్లు కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు జాతీయ జెండాకే అవమానం జరిగిందని, ఈ అవమానంపై అధికారిక పార్టీ ఎలా ఫీల్ అవుతున్నదో ప్రజలకు తెలియజేయాలి’ అని ట్వీట్ చేశారు.
నూతన భారతావనిలో జాతీయ జెండాపై పార్టీ జెండా పెట్టడమే సబబే అవుతుందా? అని యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ ట్వీట్ చేసి అభ్యంతరం తెలిపారు. జాతీయ జెండాకు అవమానాన్ని భారత సహించదని యూత్ కాంగ్రెస్ పేర్కొంది.
బీజేపీ దేశానికంటే పార్టీకే ప్రాధాన్యతనిస్తుందని, జాతీయ జెండా కంటే పార్టీ జెండాకే తొలి ప్రాధాన్యమిస్తుందని సమాజ్వాదీ ప్రతినిధి ఘన్శ్యామ్ తివారీ ట్వీట్ చేశారు. ఎప్పట్లాగే బీజేపీ ఉలకదు, పలకదని చురకలంటించారు. దీనిపై పశ్చాత్తాపం, బాధలాంటివేవీ ఆ పార్టీకి ఉండవని పేర్కొన్నారు.
