బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది: రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని బళ్లారిలో జరిగిన మెగా ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది.
Congress leader Rahul Gandhi: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర కాశ్మీర్ వరకు సాగనుంది. 3,570 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర శనివారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహంగా భావిస్తున్న ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్లో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ గుండా ముందుకు సాగిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్నాటకలోని బల్లారికి చేరుకుంది. రాహుల్ గాంధీ వెంట భారీ సంఖ్యలో జనాలు ముందుకు కదిలారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ/ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని వేలాది మంది ప్రజలు భావిస్తున్నందున ఈ యాత్రకు ‘భారత్ జోడో యాత్ర’ అని పేరు పెట్టామని తెలిపారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇక్కడి బీజేపీ సర్కారు ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని రాహుల్ గాంధీ ఆరోపించారు. "కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీలకు వ్యతిరేకం. ఎస్సీ-ఎస్టీ ప్రజలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయి " అని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే, "ఈ రోజు, భారతదేశంలో 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? బదులుగా, కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారారు" అని ఆయన మోడీ సర్కారును విమర్శించారు. ‘‘కర్ణాటకలో 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి?...పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ కావాలంటే రూ.80 లక్షలు చెల్లించి ఒక్కటి కావచ్చు. డబ్బుంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కోవచ్చు. డబ్బు లేదు, మీరు జీవితాంతం నిరుద్యోగులుగా ఉండాల్సిందేనా? " అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.