ప్రైవేట్లో కొవాగ్జిన్ ధరలను తగ్గించలేం: తేల్చి చెప్పిన భారత్ బయోటెక్
కొవాగ్జిన్ ధరలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది భారత్ బయోటెక్. వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని తేల్చి చెప్పింది. నష్టం వచ్చినా కేంద్రానికి ఒక డోసును రూ.150కే ఇస్తున్నామని అయితే.. ఎక్కువకాలం ఇంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని స్పష్టం చేసింది భారత్ బయోటెక్.
కొవాగ్జిన్ ధరలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది భారత్ బయోటెక్. వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని తేల్చి చెప్పింది. నష్టం వచ్చినా కేంద్రానికి ఒక డోసును రూ.150కే ఇస్తున్నామని అయితే.. ఎక్కువకాలం ఇంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని స్పష్టం చేసింది భారత్ బయోటెక్. ఉత్పత్తిలో పది శాతం కంటే తక్కువే.. ప్రైవేట్ రంగానికి ఇస్తున్నామని చెప్పింది. ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించలేమని స్పష్టం చేసింది భారత్ బయోటెక్.
కాగా, కొద్దిరోజుల కిందట ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. కోవిషీల్డ్ రూ.780, కోవాగ్జిన్ రూ.1,410, స్పుత్నిక్ వి రూ.1,145గా నిర్ణయించింది. కరోనా వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై రాష్ట్రాలు టీకా కోసం పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశిస్తూ ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో సార్వత్రిక వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
దీనిలో భాగంగా 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. సీరమ్ ఇన్స్టిట్యూట్కు 25 కోట్లు, భారత్ బయోటెక్కు 19 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు వెల్లడించింది.