త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ పలు బృందాలు నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ పలు బృందాలు నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కీలక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 144 సెక్షన్ విధించారు. జనాలు పెద్ద ఎత్తున ఒకచోట చేరడాన్ని నిషేధించారు. భారత్ బంద్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు కనీసం 250 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

- భారత్ బంద్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భారీగా భద్రత బలగాలను మోహరించారు. రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

-భారత్ బంద్ నేపథ్యంలో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు తమ మొత్తం బలగాలు ఈరోజు విధుల్లో ఉంటాయని కేరళ పోలీసులు తెలిపారు. హింస, ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడే వారిని అరెస్టు చేయనున్నట్టుగా పేర్కొన్నారు. 

- జిల్లాలో CrPC సెక్షన్ 144 విధించబడిందని యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ఆదివారం పునరుద్ఘాటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని ప్రజలను కోరారు.

- జార్ఖండ్‌లో భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో సోమవారం పాఠశాలలు మూసివేయబడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

- బీహార్‌లో ఇటీవల అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళన సందర్భంగా చోటుచేసుకన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ప్రస్తుతానికి 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నిర్వహించే జనతా దర్బార్‌ కూడా వాయిదా పడింది.

- భారత్‌ బంద్‌ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రత బలగాలను అందుబాటులో ఉంచారు. హౌరాలోని హౌరా స్టేషన్, హౌరా వంతెన, సంత్రాగచ్చి జంక్షన్, షాలిమార్ రైల్వే స్టేషన్, ఇతర ప్రదేశాలలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

- అగ్నిపథ్‌‌కు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టనుంది. పలు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. 

-భారత్ బంద్ నేపథ్యంలో.. మగధ ఎక్స్‌ప్రెస్, శ్రమజీవి ఎక్స్‌ప్రెస్, పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ సహా తూర్పు మధ్య రైల్వే నుంచి నడిచే పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి. 

- భారత్ బంద్ పిలుపుతో రైళ్లు రద్దు కావడంతో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిన్న రాత్రి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు తాము వెళ్లాల్సిన రైళ్లు రద్దు చేయబడలేదని.. ఇప్పుడు ఇక్కడికి చేరుకునేసరికి రద్దైనట్టుగా అధికారులు తెలిపారని కొందరు ప్రయాణికులు తెలిపారు.

- భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది

- అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా అనేక రైళ్లు రద్దు కావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రద్దు కారణంగా చాలా మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోవడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ కమాండోలను మోహరించారు.