కర్ణాటకలో ఇద్దరు యువకులను చితకబాదిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. దాడి చేసిన సమయంలో ఓ బీర్ బాటిల్ మూతను నిందితులు అక్కడే వేశారు. ఆ బీర్ బాటిల్ మూతతో నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.
బెంగళూరు: రాత్రిపూట మద్యం మత్తులో వెర్రెక్కిపోయిన మూక ఎలాంటి దారుణానికైనా పాల్పడే ముప్పు ఎక్కువ. అందుకే నగరాల్లో నడిరాత్రి వీధుల్లో తిరగడం శ్రేయస్కరం కాదు. పోలీసులు అందుబాటులోకి వచ్చేసరికే దుర్ఘటన జరిగిపోయేవే ఎక్కువ. ఇలా బెంగళూరులోని ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులను గుర్తించడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలే లేకపోయాయి. స్పాట్లో రెండు సార్లు పరిశీలనలు చేసిన తర్వాత ఓ కీలక క్లూ దొరికింది. అది.. ఆ నిందితులు దాడి చేయడానికి ముందు తాగి పడేసి బీర్ బాటిల్ మూత.
బెంగళూరు మిలీనియం బార్ వద్ద జులై 16వ తేదీన మిథున్ రాజ్, ముత్తురాజ్ మిత్రులు ఓ ఆటో కూర్చుని మ్యూజిక్ వింటూ టైంపాస్ చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు బైక్ పై అక్కడికి వచ్చి బీర్ బాటిళ్లతో వారిపై దాడి చేసి పారిపోయారు. బాధితులు ఇద్దరూ నిస్సహాయ స్థితిలో గాయాలతో నేలపై పడిపోయారు. స్థానికులు గమనించి వారిని హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కానీ, కేసును ముందుకు కదల్చడానికి ఏ ఆధారాలూ వారికి లభించలేవు. సీసీటీవీ కెమెరాలోనూ వారు చిక్కలేదు. దీంతో పోలీసులు మరోసారి స్పాట్కు వెళ్లి పరిశీలించారు. అక్కడ వారికి ఓ బీర్ బాటిల్ మూత దొరికింది. ఆ బీర్ బాటిల్ మూతను పోలీసులు ఓ ఆధారంగా మలుచుకున్నారు.
Also Read: ఎంపీ అర్వింద్కి అసమ్మతి నేతల షాక్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హంగామా, కిషన్ రెడ్డి వార్నింగ్
బీర్ బాటిల్ మూత పై బ్యాచ్ నెంబర్ ఉండటం కేసు పురోగతికి దోహదపడింది. బ్యాచ్ నెంబర్ ఆధారంగా వారు బార్ ఆచూకీ కనిపెట్టగలిగారు. అనంతరం, ఆ బార్ సీసీటీవీలు పరిశీలించారు. అప్పుడు నిందితులు ఆ బార్లో బీర్ బాటిళ్లు కొనుగోలు చేసి బైక్ పై వెళ్లుతున్న దృశ్యాలను పోలీసులు చూడగలిగారు. ఈ ఆధారంతో పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. అప్రోజ్, రాకేశ్, రాజు, ఆదిల్ పాషాలను నలుగురు నిందితులుగా పోలీసులు గుర్తించారు. మరో అవాక్కయ్యే విషయం ఏమిటంటే.. ఆ ఇద్దరిపై ఎందుకు దాడి చేశారని అడగ్గా.. సరదా కోసమే కొట్టామని వారు చెప్పారు. ఆటో కూర్చొన్న ఆ ఇద్దరూ తమకు తెలియదని, దారిలో వెళ్లుతూ వెళ్లుతూ వారిపై దాడి చేసి వెళ్లిపోయామని చెప్పడం గమనార్హం.