Asianet News TeluguAsianet News Telugu

కేరళ నుంచి కోల్‌కతా వెళ్లిన వ్యక్తిలో నిఫా వైరస్ లక్షణాలు.. ఉలిక్కిపడ్డ బెంగాల్

కేరళను భయపెడుతోన్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్‌కు పాకినట్లుగా వార్తలు వస్తున్నాయి . ఇటీవల కేరళ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి నిఫా వైరస్ లక్షణాలతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

Bengal man hospitalised with Nipah symptoms after returning from Kerala ksp
Author
First Published Sep 20, 2023, 3:52 PM IST

కేరళను భయపెడుతోన్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్‌కు పాకినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిఫా వైరస్‌ను పోలిన లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరడమే దీనికి కారణం. ఇటీవల కేరళ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి నిఫా వైరస్ లక్షణాలతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. కేరళలో వలస కూలీలుగా పనిచేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన వ్యక్తి తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లుగా ఆయన వెల్లడించారు. 

20 ఏళ్ల వయసున్న ఆ యువకుడికి అవసరమైన పరీక్షలు చేయాల్సి వుందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు వ్యక్తి తొలుత కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బెంగాల్‌కు తిరిగి వచ్చాడని.. అయితే రెండ్రోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యాడని సదరు అధికారి తెలిపారు. ఆ యువకుడిని తొలుత నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి, ఆపై బెలియాఘట ఐడీ హాస్పిటల్‌కు తరలించారు. 

Also Read: నిఫా వైరస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి?

ఇకపోతే..  కేరళలో నిపా వైరస్ సంక్రమణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై పోరాడేందుకు కేరళ ప్రభుత్వం ఓపీడీ సేవను ప్రారంభించింది. ఇ-సంజీవని టెలిమెడిసిన్ సిస్టమ్ పేరిట ప్రత్యేక ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా కోజికోడ్ జిల్లా కలెక్టర్ (DC) ఎ.గీత మాట్లాడుతూ... నిపా సంబంధిత భయాందోళనలను దూరం చేయడంలో ఈ సేవ దోహదపడుతుందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉన్న వ్యక్తులు డాక్టర్‌ని సందర్శించకుండానే ఆన్‌లైన్‌లో వైద్య సహాయం పొందవచ్చు. ఈ-సంజీవని నిపా OPD సేవ ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇ-సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా, మీరు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చికిత్స పొందవచ్చని తెలిపారు. 

కొత్త నిఫా వైరస్ కేసుల్లేవ్

ఇదిలావుండగా, కేరళలో వరుసగా రెండో రోజు కూడా నిఫా వైరస్ కొత్త కేసులేవీ నమోదు కాలేదని కేరళ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురికి నిఫా సోకింది. వారిలో ఇద్దరు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మరణించారు. గతంలో కూడా ఇక్కడ నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళలో నాల్గవ సారి నిఫా వైరస్ సంక్రమణ కేసు నిర్ధారించబడింది. గతంలో 2018, 2021లో కోజికోడ్‌లో, 2019లో ఎర్నాకులంలో కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios