BJP MP Arjun Singh: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్ బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా బెంగాల్ బీజేపీ కీలకనేత, బరాక్ పూర్ ఎంపీ అర్జున్ సింగ్ టీఎంసీలో చేరారు.
BJP MP Arjun Singh: పశ్చిమబెంగాల్లో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బరాక్పూర్ ఎంపీ అర్జున్సింగ్ పార్టీకి షాక్ ఇచ్చి.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో చేరారు. ఆయనతో పాటు తన కుమారుడు పవన్ సింగ్ TMCలో చేరారు.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. బరాక్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దాదాపు మూడేండ్ల తర్వాత తిరిగి సొంతగూటికి చేరారు. TMCలో చేరడానికి ముందు.. BJP MP అర్జున్ సింగ్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్, ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి కామెక్ స్ట్రీట్లోని TMC కార్యాలయంలో సమావేశమయ్యారు.
తృణమూల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేస్తూ, 'ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ కుటుంబానికి పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ మాజీ ఉపాధ్యక్షుడు మరియు బరాక్పూర్ ఎంపీ అయిన అర్జున్ సింగ్కు హృదయపూర్వక స్వాగతం. మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన మాతో చేరారు. BJP Bengal మాజీ వైస్ ప్రెసిడెంట్, బరాక్పూర్ ఎంపీ Arjunsinghని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తుందని ట్విట్ చేసిగత కొన్ని రోజులుగా.. అర్జున్ సింగ్ పార్టీని సరిగ్గా పనిచేయనివ్వడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడ్డారు. జనపనార ధరలను క్వింటాల్కు రూ.6,500కు పెంచుతూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవడంపై అర్జున్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర శాఖలో వర్గపోరుకు సంబంధించి బీజేపీ ఉన్నతాధికారులను కలవడానికి అర్జున్ సింగ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లినట్లు కూడా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన జూట్ మిల్లు అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ అసంతృప్తి నడుమ ఎంపీ అర్జున్ సింగ్ గత ఆరు నెలలుగా తృణమూల్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఆయనను ఒప్పించేందుకు బీజేపీ పలుమార్లు విఫలయత్నాలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు బరాక్పూర్ స్థానం నుంచి దినేష్ త్రివేదికి టిక్కెట్ ఇవ్వడంతో అర్జున్ సింగ్ తృణమూల్ను వీడారు. ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన త్రివేదిపై ఆయన విజయం సాధించారు. సింగ్ కుమారుడు పవన్ సింగ్ భట్పరా నుండి బిజెపి ఎమ్మెల్యే, ఆయన కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. బాబుల్ సుప్రియో తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీని వీడిన రెండో లోక్సభ ఎంపీ అర్జున్ సింగ్. సీనియర్ తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ మరణం తర్వాత.. బాబుల్ సుప్రియో ఇటీవల బల్లిగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో TMC టిక్కెట్పై పోటీ చేసి విజయం సాధించారు.
అర్జున్ సింగ్ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై తొలిసారి ఎంపీ అయ్యారు. దీనికి ముందు, అతను 2001 నుంచి 2019 వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. ఆయన భట్పరా మునిసిపాలిటీకి ఛైర్మన్గా కూడా ఉన్నాడు, కానీ, పలు విభేదాలు రావడంతో బిజెపిలో చేరారు. .