‘భాయ్’ అని పిలవనందుకు తీవ్రంగా కొట్టి.. నేలపై పారేసిన బిస్కెట్లు తినాలని.. పూణేలో అమానవీయ ఘటన
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ‘భాయ్’ అని పిలవనందుకు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. నేలపై విసిరేసిన బిస్కెట్లు తినాలని బలవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
రోజు రోజుకు కొందరు మనుషుల్లో పైశాచికత్వం పెరిగిపోతోంది. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా.. సౌకర్యాలు ఎంత మెరుగైనా.. కొన్ని అనాగరిక అలవాట్లను మాత్రం మానుకోలేకపోతున్నారు. తాము చెప్పినట్టు చేయడం లేదని దాడులు చేస్తున్నారు. తాజాగా పుణేలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
‘భాయ్’ అని పిలవనందుకు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. అలాగే నేలపై విసిరేసిన బిస్కెట్లు తినాలని బలవంతం చేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్లో జరిగిందీ ఘటన. 20 ఏళ్ల బాధితుడు నిందుతుల్లో ఒకరిని ‘భాయ్’ అని పిలవలేదు. అతడిని పేరుతో పిలిచాడు. దీంతో ఆగ్రహించిన కొందరు యువకులు అతడిని తీవ్రంగా చితకబాదారు. బెల్టుతో కొట్టారు. నేలపై బిస్కెట్లు విసిరేశారు. వాటిని తినాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధిచిన వీడియో గురువారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఓ యువకుడిని తీవ్రంగా, కొట్టి అతడిపై అమానవీయంగా ప్రవర్తించినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాకాడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒకరు బాధితురాలిపై 'భాయ్' అనే పదాన్ని ఉపయోగించకుండా తన పేరుతో పిలిచినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క పదమే ఘటనకు దారి తీసిందని చెప్పారు.