Asianet News TeluguAsianet News Telugu

ఫ్యామిలీతో కేజ్రీవాల్ అయోధ్య టూర్ .. వెంట పంజాబ్ సీఎం కూడా, జాతీయ స్థాయిలో చర్చ

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అయోధ్య రామాలయాన్ని దర్శించుకోనున్నారు  

arvind Kejriwal, Bhagwant Mann to visit ayodhya ram mandir tomorrow along with families ksp
Author
First Published Feb 11, 2024, 5:46 PM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య రామాలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తన ఫ్యామిలీతో ఆలయానికి వెళ్లనున్నారు. జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్టకు రావాలని కేజ్రీవాల్‌కు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందినప్పటికీ ఆయన వెళ్లలేదు. దీనికి బదులు తన భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి మరోసారి అయోధ్య వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. 

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఈడీ విచారణకు సహకరించడం లేదంటూ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. 

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. గడిచిన నాలుగు నెలల్లో కేజ్రీవాల్ నాలుగు సమన్లను దాటవేశారు.

‘‘సమన్లు ఇచ్చినా అరవింద్ కేజ్రీవాల్ కనిపించడం లేదని, ఆయన ప్రభుత్వోద్యోగి’’ అని ఈడీ కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ స్కాంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లను తమ లీగల్ టీమ్ అధ్యయనం చేస్తోందని ఆప్ పేర్కొంది. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు :

మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 - 22 ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించిందని , ఇందుకోసం లంచాలు చెల్లించిన కొంతమంది డీలర్లకు ఇది అనుకూలంగా వుందని ఈడీ ఆరోపించింది. ఈ అభియోగాలను పలుమార్లు ఆప్ ఖండించింది. ఈ పాలసీని తర్వాత రద్దు చేయగా.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు సిఫారసు చేశారు. అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios