మహారాష్ట్ర, కన్నడ రాష్ట్రల సరిహద్దులో ఓ పెళ్లి జరిగింది. పెళ్లి బరాత్ తీస్తుండగా యువకులు కన్నడ పాటలకు డ్యాన్స్ చేయడాన్ని, కన్నడ జెండాలను చేత పట్టుకోవడాన్ని మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి తప్పుపట్టింది. వారిపై దాడి చేసింది. సుమారు ఐదుగురు మంది గాయపడ్డారు.
బెంగళూరు: పెళ్లి బరాత్లో పాటల కంటే మ్యూజిక్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి భాషతో సంబంధం లేకుండా పాటలు మోగుతూనే ఉంటాయి. హుషారులో డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. చాలా సార్లు పాటతో సంబంధం లేకుండా కూడా డ్యాన్సులు చేస్తుంటారు. కానీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఈ అభిప్రాయాలకు విరుద్ధమైన ఘటన జరిగింది. కన్నడ పాటలకు డ్యాన్సులు చేస్తున్నారని, కన్నడ జెండాలు పట్టుకున్నారని మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.
కర్ణాటకలో బెళగావి తాలూక దామనే గ్రామానికి చెందిన సిద్దు సాయిబన్నావార్, రేష్మాలు పెళ్లి చేసుకున్నారు. బరాత్ మొదలైంది. ఈ బరాత్లోకి పెళ్లి కొడుకునూ డ్యాన్స్ చేయించడానికి బయటకు తీసుకువచ్చారు. వారు డ్యాన్స్ చేయడానికి కన్నడ పాటలు వేసుకున్నారు. కానీ, చన్నమ్మ నగర్లో కొందరు మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. పెళ్లి కొడుకును దూషించారు. ఐదుగురు యువకులపై దాడి చేశారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాారు. అంతేకాదు, కొందరు అనుమానితులనూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి తీరును సీఎం ఖండించారు. తమ పోలీసులు ఇప్పటికే యాక్షన్లోకి దిగారని వివరించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని సహించబోమని అన్నారు. ఎప్పుడైనా సరే కన్నడిగలు సమస్యల్లో పడ్డప్పుడు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే లాంగ్వేజ్ కాంట్రవర్సీ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కన్నడ యాక్టర్ కిచ్చ సుదీప్ వ్యాఖ్యలపై హిందీ యాక్టర్ అజయ్ దేవగన్ తప్పుపట్టారు. ఆ తర్వాత వారి మధ్య సంభాషణ దేశవ్యాప్తంగా లాంగ్వేజ్ కంట్రావర్సీని రగిల్చింది.
దక్షిణాది సినిమాలు బాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నాయని, దేశవ్యాప్తంగా హిట్ అవుతున్నాయని కన్నడ యాక్టర్ సుదీప్ అన్నారు. దేశ ప్రజలు అందరూ ఆదరించే సినిమాలను దక్షిణాది సినిమాలు రూపొందిస్తున్నాయని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే హిందీ ఇక ఎంత మాత్రం జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో సుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో చర్చ తీవ్రంగా జరిగింది. ఓ యాక్టర్ విక్రాంత్ రోనా కూడా హిందీ ఇక జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ రియాక్ట్ అయ్యారు. కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్కు నేరుగా ట్వీట్ చేసి ఢీకొన్నారు.
‘సొదరా కిచ్చా సుదీప్.. మీరన్నట్లు హిందీ జాతీయ భాష కాదని భావిస్తున్నప్పుడు మీ మాతృభాష సినిమాలు హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? హిందీ మా మాతృభాష, అది ఎప్పటికైనా జాతీయ భాషనే. జనగణమన’ అంటూ అజయ్ దేవ్గన్ కిచ్చా సుదీప్ను ట్యాగ్ చేస్తూ హిందీ భాషలో ట్వీట్ చేశారు.
