పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం.. అమరీందర్ నాయకత్వంలోనే ఎన్నికల బరిలోకి, తేల్చిచెప్పిన అధిష్టానం
అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నారు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ . ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు వుండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే.
త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి సరిగా లేదని ఆయనను వెంటనే మార్చాల్సిందేనని పట్టుబట్టారు. అవసరమైతే సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి హరీశ్ రావత్.. అసంతృప్త మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
Also Read:సీఎంపై విశ్వాసం లేదు.. మార్చేయండి: 31 మంది ఎమ్మెల్యేల నిర్ణయం
నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి గురించి వివరించారని హరీశ్ రావత్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు చెప్పారన్న ఆయన .. వారందరూ ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. పటిష్టమైన ప్రణాళికతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది వారి ఆకాంక్ష అని హరీశ్ రావత్ పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని హరీశ్ తెలిపారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు వుండదని స్పష్టం చేశారు.