రేపు జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్పారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారంనాడు సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఈ నెల 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో రేపు జరిగే పోలింగ్ లో 5,30,85,566 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2,66,82,156 పురుషు ఓటర్లు కాగా, 2,63,98,483 మంది మహిళ ఓటర్లున్నారు. రాష్ట్రంలో 4.927 మంది ట్రాన్స్ జెండర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మనోజ్ కుమార్ చెప్పారు.
రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో పోటీ చేస్తుంది. కర్ణాటకలోని మేల్కోటే స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు.207 అసెంబ్లీ స్థానాల్లో జేడీ)ఎస్) పోటీ చేస్తుంది. ఆప్ 209, బీఎస్పీ 133 స్థానాల్లో, సీపీఎం నాలుగు స్థానాల్లో , ఎన్పీపీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది.
రేపు జరిగే పోలింగ్ లో 693 మంది అభ్యర్ధులు రిజిష్టర్డ్ పార్టీల తరపున బరిలో నిలిచారు. 918 మంది అభ్యర్ధులు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు గాను 1.56 లక్షల పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 84,119 మంది పోలీస్ సిబ్బంది రాష్ట్రానికి చెందినవారు. మిగిలిన బలగాలను ఇతర రాష్ట్రాల నుండి రప్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58,545 నోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలతో ఇవాళ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
