UP Elections 2022: ఎంఐఎం వ్యూహాత్మక అడుగులు.. యూపీ పోరులో హిందువులను బరిలోకి దింపుతూ.. !
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. అయితే, బీజేపీని టార్గెట్ చేస్తూ.. యూపీ ఎన్నికల బరిలో దిగుతున్న ఎంఐఎం పార్టీ.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 27 స్థానాల్లో పోటీకి దిగుతున్న ఎంఐఎం.. అందులో నాలుగు స్థానాల్లో హిందూ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీల నేతలు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో యూపీ రాజకీయాలు హీటెక్కాయి. ఎలాగైనా వరుసగా రెండో సారి అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇక అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ అధికారం తమదే అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్, బీఎస్పీలు సైతం ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్నాయి.
ఈ సారి జరిగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సైతం బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఈ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అయితే, బీజేపీని టార్గెట్ చేస్తూ.. యూపీ ఎన్నికల బరిలో దిగుతున్న ఎంఐఎం పార్టీ.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 27 స్థానాల్లో పోటీకి దిగుతున్న ఎంఐఎం.. అందులో నాలుగు స్థానాల్లో హిందూ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో నలుగురు హిందువులకు కూడా టికెట్లు కేటాయించడం చర్చనీయాంశమవుతోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు హిందూ అభ్యర్ధుల పేర్లను ఎంఐఎం ప్రకటించింది. వీరిలో ఘజియాబాద్ లోని సాహిబాబాద్ సీటు నుంచి పండిట్ మన్మోహన్ ఝా, ముజఫర్ నగర్ పరిధిలోకి వచ్చే బుధానా సీటు నుంచి భీమ్ సింగ్ బల్యాన్, మీరట్ లోని హస్తినాపూర్ సీటు నుంచి వినోద్ జాతవ్, బారాబంకిలోని రామ్ నగర్ నుంచి వికాస్ శ్రీవాస్తవ పోటీ చేయబోతున్నారు. ఈ స్థానాల్లోనే కాకుండా ఎంఐఎం బరిలోకి దిగే మొత్తం 27 స్థానాల్లో ఓట్ల చీలిక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ స్థానాలే కాకుండా బరేలీ, సహరన్పూర్ దేహత్, భోజ్పూర్, రుదౌలి, లోనీ, హస్తినపూర్, మీరట్ సిటీ, రాంనగర్, నాంపరా వంటి స్థానాల నుంచి బరిలోకి దింపే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఎంఐఎం. రానున్న రోజుల్లో మరికొంత మంది అభ్యర్థులను ప్రకటిస్తామని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
సీట్ల కేటాయింపుపై ఎంఐఎం నేతలు తాము మతం ఆధారంగా టిక్కెట్లు కేటాయించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లు ఎన్నికల ప్రచారం పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రలో ముస్లిం నాయకత్వం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాజకీయ లౌకిక వాదం, రాజ్యంగ లౌకిక వాదం వంటి అంశాలను ప్రస్తావించారు. ఎంఐఎం జతకట్టిన కూటమి మొత్తం 403 పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందనీ, 95% సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని ఒవైసీ చెప్పారు.కాగా, ఉత్తరప్రదేశ్లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 117 నియోజకవర్గాలున్న పంజాబ్లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్లో 70 స్థానాలు, గోవాలో 40 స్థానాలు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. 60 స్థానాలున్న మణిపూర్లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని అసెంబ్లీ స్థానాలకు (Assembly election 2022) ఓట్ల లెక్కింపు జరగనుంది.