ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో సివిల్ వార్‌లో 55 మంది మరణించారని.. ప్రధాని మోదీ మాత్రం బెంగళూరులో రోడ్ షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బెంగళూరు: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో సివిల్ వార్‌లో 55 మంది మరణించారని.. ప్రధాని మోదీ మాత్రం బెంగళూరులో రోడ్ షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారం ది కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్ చేస్తున్నారని విమర్శించారు. ఐసిస్ వీడియో విడుదల చేసిందని.. వారి హిట్ లిస్ట్ లో తనపేరు కూడా ఉందని అన్నారు. తనను కూడా చంపేస్తామంటూ ఐసిస్ ఇప్పటికే ప్రకటించిందని చెప్పారు. ఎవరి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తి లేదని అన్నారు.

ఇదిలా ఉంటే.. కర్ణాటక ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రచారంపై కూడా అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌‌లో చేరి ఎన్నికల బరిలో జగదీష్ షెట్టర్ తరఫున సోనియా గాంధీ ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. హుబ్బలిలో జరిగిన ఓ ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రశ్నిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభ్యర్థికి సోనియా గాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. ఇదేనా మీ సెక్యూలరిజం? మోడీని ఇలాగే ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ విఫలమవడం సిగ్గుచేటని, వారి జోకర్లు, సేవకులు, బానిసలు.. తమను బీజేపీ బి-టీమ్ అంటూ నిందిస్తారని విమర్శించారు. 

బీజేపీ‌లో కీలక నేతగా వ్యవహరించిన అయినా జగదీష్ షెట్టర్‌కు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుండి జగదీష్ షెట్టర్‌ను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది.