చత్తీస్గడ్లో మావోయిస్టు మరో ఇంజనీర్ అధికారిని, ఓ వర్కర్ను కిడ్నాప్ చేశారు. ఈ అపహరణ గురించి తెలియగానే ఇంజనీర్ భార్య మావోయిస్టులను ఉద్దేశిస్తూ భావోద్వేగంగా ఓ వీడియో విడుదల చేశారు. తన కూతుళ్ల కోసమైనా భర్తను వదిలిపెట్టాలని కోరారు. ఆ తర్వాత స్వయంగా అడవుల్లోకి భర్తను వెతకడానికి వెళ్లిపోయారు.
రాయ్పూర్: చత్తీస్గడ్(Chhattisgarh) అడవుల్లో(Forest) రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టే అధికారులను మావోయిస్టులు(Maoists) కిడ్నాప్ చేయడం సాధారణంగా మారింది. ఇప్పటి వరకు చాలా మంది అధికారులను అలా కిడ్నాప్(Kidnap) చేశారు. అదే విధంగా ఇంజనీర్ అశోక్ పవార్, వర్కర్ ఆనంద్ యాదవ్లను మావోయిస్టు అపహరించుకు వెళ్లిపోయారు. ఈ ఘటన వారి కుటుంబంల్లో అలజడి రేపింది. ఇంజనీర్ భార్య సోనాలీ పవార్ బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. తన కూతుళ్ల కోసమైనా భర్తను వదిలిపెట్టాలని ఆమె భావోద్వేగపూరిత వీడియో చేశారు. ఆ తర్వాత ఆమె స్వయంగా తన భర్తను వెతకడానికి అడవుల్లోకి బయల్దేరి వెళ్లిపోయారు.
తన భర్తను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన భర్తను విడుదల చేయాలని అదే ఆవేదనతో ఆమె మావోయిస్టులను కోరారు. కానీ, ఆమె విజ్ఞప్తికి బదులు అందలేదు. ఇక ఆమె మరికొంత కాలం ఎదురుచూడాలని భావించలేరు. స్వయంగా తాను అడవుల్లోకి వెళ్లి భర్తను వెతికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తన మైనర్ కూతురును వెంటబెట్టుకుని ఆమె అడవుల్లోకి వెళ్లారు. మావోయిస్టులు ఉంటారని భావించే అబూజ్మడ్ ప్రాంతానికి ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించారు. రెండున్నరేళ్ల తన కూతురుతో ఆమె అబూజ్మడ్ చేరుకున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, మావోయిస్టులు ఇంజనీర్ అశోక్ పవార్, వర్కర్ ఆనంద్ యాదవ్ను విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం వారిద్దరినీ సురక్షితం వదిలిపెట్టారు. కానీ, తన భర్తను వెతుకుతూ అడవిబాట పట్టిన సోనాలీ పవార్ మాత్రం ఇంకా బయటకు రాలేరు. అయితే, ఆమె స్థానిక జర్నలిస్టులు, పోలీసు అధికారులతో టచ్లో ఉన్నారు.
ప్రస్తుతం అశోక్ పవార్, యాదవ్లు బీజాపూర్లోని కుత్రులో తాత్కాలికంగా ఉంచినట్టు అదనపు ఎస్పీ పంకజ్ శుక్లా బుధవారం తెలిపారు. సోనాలీ పవార్ కూడా తన భర్తను కలవడానికి కుత్రుకే వస్తున్నారని వివరించారు.
కొంతమంది జర్నలిస్టులు, స్థానికుల సహాయంతో సోనాలీ పవార్ అబుజ్మడ్కు చేరుకున్నారు. బీజాపూర్, నారాయణ్పూర్ సరిహద్దుల గుండా ఆమె అబూజ్మడ్ చేరుకున్నట్టు తెలిసింది. రెండున్నరేళ్ల తన కూతురును ఆమె వెంట తీసుకెళ్లారు. కాగా, ఐదేళ్ల పెద్ద కూతురిని కుటుంబ సభ్యుల దగ్గరే ఉంచారు.
మావోయిస్టులు విడుదల చేసిన అశోక్ పవార్, యాదవ్ కుత్రుకు చేరుకున్నట్టు స్థానిక జర్నలిస్టు ఒకరు తెలిపారు. వారు తమ స్వగృహానికి వెళ్లడానికి తలా ఒకరికి రూ. 2 వేలు ఇచ్చినట్టు యాదవ్ చెప్పారని ఆ జర్నలిస్టు వివరించారు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో అశోక్ పవార్ బెంబేలెత్తిపోయారని, ఆయనను అబ్జర్వేషన్లో ఉంచుతామని పోలీసులు తెలిపారు.
కాగా, గతేడాది నవంబర్లో మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డును సర్వే చేస్తుండగా సబ్ ఇంజనీర్ను, ప్యూన్ను పట్టుకెళ్లిపోయారు. సుమారు వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను వదిలిపెట్టారు. ప్యూన్ లక్ష్మణ్ పర్తగిరిని ముందుగానే రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద సబ్ ఇంజనీర్ అజయ్ లక్రా పని చేశారు.వృత్తిలో భాగంగా ఓ రోడ్డు సర్వే చేయడం మొదలుపెట్టాడు. ప్యూన్ లక్ష్మణ్ పర్తగిరితో కలిసి రోడ్డు సర్వే చేస్తూ అడవి లోపలకు కొంత దూరం వెళ్లాడు. దీంతో మావోయిస్టులు వారిని అక్కడే పట్టేసుకున్నారు. నవంబర్ 11వ తేదీన వీరు సర్వే చేస్తూ మళ్లీ సాయంత్రానికి తిరిగి రాలేదు. గోర్నా-మాంకేలి మధ్య 15 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు.
11వ తేదీన వీరిద్దరూ తిరిగి రాకపోవడంతో బీజాపూర్ జిల్లా హెడ్క్వార్టర్ తర్వాతి రోజే గాలింపులు మొదలు పెట్టింది. చివరికి వారు కన్హయగూడ గ్రామం దగ్గర సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను, ప్యూన్ లక్ష్మన్ పర్తగిరిని నక్సల్స్ పట్టుకున్నారని పోలీసులు ధ్రువీకరించారు.
