African Swine Fever in Kerala: కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (African Swine fever) కలకలం సృష్టిస్తుంది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి దగ్గర ఉన్న రెండు పందుల ఫామ్స్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆ పందులన్నింటిని చంపాలని అధికారులు ఆదేశించారు.
African Swine Fever in Kerala: ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వంటి వైరస్ లు ప్రపంచ మానవాళిని భయభంత్రులకు గురి చేస్తున్న వేళ తాజాగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(African Swine Fever) అనే మరో కొత్త మహమ్మారి వెలుగులోకి వచ్చింది. అది కూడా మనదేశంలోని కేరళ రాష్ట్రంలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లా(Wayanad District)లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని మనంతవాడిలోని రెండు ఫామ్స్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (African Swine Fever) కేసులు నమోదైందని కేరళ అధికారులు తెలిపారు. అయితే దీని వల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్లో శాంపిల్స్ను పరీక్షించగా జిల్లాలోని రెండు ఫామ్ లలోని పందులకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. కేరళలోని వాయనాడ్లో ఈ కేసులు వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చాలా ఆందోళన చెందింది. దీనికి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
పందులను చంపాలని ఆదేశాలు
ఫామ్స్ ల్లో పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో .. వాటి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపినట్లు పశుసంవర్థక శాఖ అధికారి తెలిపారు. దర్యాప్తు నివేదికలో ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిందని, ఆ ఫామ్ లలో ఉన్న 300 పందులను చంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వాటిని ఇతర జంతువుల నుంచి వేరుగా ఉంచాలని జంతువుల యజమానులకు సూచిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ పశుసంవర్ధక శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసు నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కేంద్రం హెచ్చరికతో ఈ నెల ప్రారంభంలో బయో-సెక్యూరిటీ చర్యలను అధికారులు కఠినతరం చేశారు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తో మానవాళికి ప్రమాదకరమా ?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి మరియు ప్రాణాంతక వైరల్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల అనేక పందులు మరణిస్తాయి. అయితే ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ నివారణకు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. కేరళలో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ రాష్ట్రంలో కోవిడ్, స్వైన్ ఫ్లూ, జీకా వైరస్ వంటి వ్యాధులు వెలుగులోకి రావడం భయాందోళన కలిగిస్తుంది.