ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. ఆలస్యంగా వెలుగులోకి... వీడియో వైరల్..
ఓ మహిళా ఎమ్మెల్యే మీద ఆమె భర్త అందరూ చూస్తుండగా చేయి చేసుకున్నాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో పంజాబ్ మహిళా కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పంజాబ్ : దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతూనే ఉన్నాయి. అయినా మహిళల మీద అఘాయిత్యాలు, నేరాలు క్షణక్షణానికి ఎక్కువవుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అలాంటి అనుభవమే ఎదురయింది. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే బల్విందర్ కౌర్ పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్ లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్ లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్.. ఆమె భర్త సుఖ్ రాజ్ సింగ్ మధ్య ఏదో కారణంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సుఖ్ రాజ్ సింగ్ అందరూ చూస్తుండగానే బల్జిందర్ పై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో వెంటనే పక్కనే ఉన్నవారు అడ్డుకుని ఆయనను అక్కడినుంచి లోపలికి తీసుకువెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటు చేసుకోగా… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమని, ఇకనైనా పురుషుల ఆలోచనా ధోరణి మారాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాసమస్యలు లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే దీనిపై బల్జిందర్ కౌర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు ఎవరు రాలేదని సమాచారం. పంజాబ్ లోని మఝూ ప్రాంతంలో ఆప్ యూత్ విభాగ కన్వీనర్ అయిన సుఖ్ రాజ్ తో బల్జిందర్ కు 2019 ఫిబ్రవరిలో వివాహమైంది. పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన కౌర్ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.