Aam Aadmi Party : కేరళలోని ట్వంటీ20 పార్టీతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పొత్తు పెట్టుకున్నట్టు ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో 24 గంటలపాటు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తుంద‌ని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కేరళ ప్రజలకు కూడా ఉచిత విద్యుత్ అక్కర్లేదా? అని ప్రశ్నించారు.    

Aam Aadmi Party : పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన‌ త‌రువాత ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఫుల్‌ జోష్ లో ఉంది. అదే జోష్ తో దక్షిణాదిలో అర‌గేట్రం చేయడానికి ఆప్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా కేర‌ళ‌లో ఆప్  కీల‌క అడుగువేసింది.  కేరళలో పార్టీ ట్వంటీ-20 పార్టీతో కలిసి ఎన్నికల్లో పోరాడుతుందని ఆప్‌ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.కేజ్రీవాల్ ఆదివారం కొచ్చీని సందర్శించారు. కేరళకు చెందిన ట్వంటీ20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్‌ను ప్రకటించారు. ట్వంటీ-20 పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. 

అరవింద్ కేజ్రీవాల్ కొచ్చిలో మాట్లాడుతూ.. ఇప్పుడు కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్, ఎన్‌డిఎ అనే నాలుగు రాజకీయ పొత్తులు ఉంటాయని, తమ కూటమి పేరు పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ అని అన్నారు. కేరళలో మా పార్టీ ట్వంటీ-20 పార్టీతో కలిసి ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పారు. మీకు రాజకీయాలు, అల్లర్లు, అవినీతి కావాలంటే.. ఇతర రాజకీయ పార్టీలోకి వెళ్లవచ్చు. అభివృద్ధి కావాలంటే... పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే.. మా వద్దకు రావాలి. ఇతర పార్టీలు మీ పిల్లలకు చదువులు చెప్పవు, ఎందుకంటే వారు అల్లర్లు, గూండాయిజం చేయాలనుకుంటున్నారు.

 24 గంటల విద్యుత్ సరఫరా కారణంగా ఢిల్లీలో ఇన్వర్టర్, జనరేటర్ దుకాణాలు మూతపడ్డాయని ఢిల్లీ సీఎం తెలిపారు. నేడు కేరళకు చారిత్రాత్మకమైన రోజు అని కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి అన్నారు. పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ట్వంటీ-20 కొత్త రాజకీయ ఫ్రంట్ ద్వారా కేరళ దాని ప్రజల సంక్షేమం కోసం కలిసి పని చేస్తాయని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో 24 గంటలపాటు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కేరళ ప్రజలకు కూడా ఉచిత విద్యుత్ అక్కర్లేదా? అని ప్రశ్నించారు. కేరళలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు.

ఢిల్లీలోని పేద కార్మికుడికి కనీస వేతనంగా రూ. 15,000 కంటే ఎక్కువ లభిస్తుందని, ఇది భారతదేశంలోనే అత్యధికమని కేజ్రీవాల్ అన్నారు. దీనితో పాటు కార్మికులకు మెరుగైన వైద్యం, విద్య, మహిళలకు రవాణా, విద్యుత్, నీరు, అన్నీ ఉచితంగానే అందజేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీ గల ఆప్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు.