జమ్మూ కాశ్మీర్ లోని బుద్గామ్ లో పట్టాలు తప్పిన రైలు..
జమ్మూ కాశ్మీర్ బుద్గామ్లోని మజోమా వద్ద ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లా మజోమా ప్రాంతంలో శుక్రవారం ఉదయం బారాముల్లా-బనిహాల్ సెక్షన్లోని ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అలాగే ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి మాగం తహసీల్దార్ జాఫర్ అహ్మద్ లోన్ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలు బనిహాల్ నుండి వస్తుండగా ట్రాక్పై నుండి జారిపడిందని చెప్పారు. స్టేషన్కు సమీపంలో ఉండటంతో రైలు వేగం తక్కువగా ఉందని, అందుకే ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని, వారు తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని లోన్ తెలియజేశారు. ‘‘రైలు బనిహాల్ నుండి వస్తూ ట్రాక్పై నుండి జారిపోయింది. స్టేషన్కు చేరుకోవడంతో రైలు వేగం తక్కువగా ఉంది. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించాం. వారంతా వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు’’ అని మాగం తహసీల్దార్ జాఫర్ అహ్మద్ లోన్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందడంతో రైల్వే అధికారులతో పాటు స్థానిక అధికారులు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ ప్రమాదం వల్ల బుద్గాం-బారాముల్లా మధ్య నడిచే అన్ని రైలు సర్వీసులు నిలిపివేశారు. వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.