పక్కింట్లో నివసించే హిందూ యువతితో ముస్లిం యువకుడు లేచిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేశారు. ఆ దంపతులు తీవ్ర గాయాలతో చనిపోయారు.
ఓ హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో వారిద్దరూ లేచిపోయారు. ఈ విషయం తెలియడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకుడి తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేశారు. ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్బాస్, అతని భార్య కమ్రుల్ నిషా, కుమారుడైన షౌకత్ తో కలిసి జీవిస్తున్నాడు. సమీపంలోనే హిందూ సామాజికవర్గానికి చెందిన షౌకత్ రాంపాల్ కుటుుంబం నివసిస్తోంది. అతడికి రూబీ అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో షౌకత్, రూబీ ప్రేమించుకున్నారు.
2020లో రూబీని షౌకత్ ఇంట్లో నుంచి తీసుకొని పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. తమ కూతురును షౌకత్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బాలిక మైనర్ కావడంతో అతడు కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లాడు. కొంత కాలం తరువాత అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ సమయంలో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ షౌకత్ తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించారు. అయితే జూన్ లో ఆ యువకుడు రుబీని మళ్లీ తీసుకొని పారిపోయి, పెళ్లి చేసుకున్నాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. దీంతో ఆ అప్పటి నుంచి ఆ యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం పలువురు కుటుంబ సభ్యులు అబ్బాస్, అతడి భార్య కమ్రుల్ నిషా పై ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టి దాడి చేశారు.
దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడే మరణించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు.
