Varanasi: "మన ప్రధాని నరేంద్ర మోడీజీ, ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ జీ నా చేతితో తయారుచేసిన తలపాగాను ధరించాలని నా హృదయపూర్వక కోరిక" అని పురాతన నగరమైన వారణాసి వాసి, 'అక్బరీ తలపాగా' సృష్టికర్త మొహమ్మద్ ఘియాసుద్దీన్ హోళీ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. గత ఐదు తరాలుగా ఈ ముస్లిం కుటుంబం తయారు చేస్తున్న ప్రత్యేక తలపాగాను హోళీ సందర్భంగా కాశీ నాథునికి అలంకరిస్తారు.  

Akbari pagri creator Hajji Ghiyasuddin Ahmed: ఆనాటి గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్ ధరించిన చిన్న, ఇతర చిత్రాలలో మనం చూసే తలపాగాను సృష్టించగల ఏకైక తలపాగా కళాకారుడు హజ్జీ ఘియాసుద్దీన్ అహ్మద్. పురాత‌న న‌గ‌ర‌మైన వార‌ణాసిలో ఉండే ఆయ‌న‌కు చెందిన ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యముంది. ఆయ‌న త‌యారు చేసే మొద‌టి అక్బరీ ప‌గ్డీ (అక్బ‌రీ తలపాగా) ను కాశీ విశ్వ‌నాథునికి స‌మ‌ర్పిస్తారు. హోలీ వేడుకల రోజుల్లో కాశీ విశ్వనాథుడు, పార్వతిమాతలను ప్రత్యేక వస్త్రాలతో అలంకరిస్తారు. అయితే, శివుడుకి అలంకరించే ఈ అక్బ‌రీ త‌ల‌పాగాను మొహమ్మద్ ఘియాసుద్దీన్ కుటుంబం గ‌త ఐదు త‌రాల నుంచి త‌యారు చేస్తోంది. ఎంతో ప్ర‌త్యేక‌మైన ఈ త‌ల‌పాగాను సంవ‌త్సరానికి ఒక‌సారి మాత్ర‌మే త‌యారు చేస్తారు. 

సంవత్ క్యాలెండర్ లోని ఫగున్ మాసంలోని పక్షం రోజుల అమావాస్య రోజైన ఏకాదశి నాడు గంగానది ఒడ్డున ఉన్న విశ్వనాథ ఆలయంలో శివుడికి తలపాగా సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. విశ్వనాథుడ‌ని విగ్రహాన్ని ఒక ప్రత్యేక పీఠంపైకి తీసుకువెళతారు. వారణాసిలో, స్థానికులు శివ‌పార్వ‌తుల వివాహ వేడుకగా హోలీని జరుపుకుంటారు. ఈ ఆచారం ఈ నగరంలో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ఉంది. అయితే, శివుడు దాదాపు 250 సంవత్సరాలుగా ధరిస్తున్న ప్రత్యేక తలపాగాను దేవుడికి అందించ‌డం గియాసుద్దీన్ కుటుంబం ప్రత్యేకత. తన కుటుంబంలోని అనేక తరాలు దీనిని తయారు చేస్తున్నాయి, అందువల్ల అతను అక్బరీ త‌ల‌పాగాను తయారు చేసే కళలో ప్రావీణ్యం సంపాదించారు.

వారణాసి నగరం హిందూ మతానికి కేంద్రంగా ఉన్నప్పటికీ, సమ్మిళిత, హిందూ-ముస్లిం సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. బిస్మిల్లా ఖాన్ వంటి అనేక మంది ప్రముఖ ముస్లిం వ్యక్తులు ఒక ఆలయంలో తమ ప్రాక్టీసు చేశారు. వారణాసిలో ఏకాదశిగా పిలువబడే ఈ పండుగలో ఘియాసుద్దీన్ కుటుంబం ఇప్పుడు భాగంగా ఉంది. మహ్మద్ గియాసుద్దీన్ నగరంలోని లాలాపుర ప్రాంతంలో నివాస‌ముంటున్నారు. శివుని కోసం అందమైన త‌ల‌పాగాను తయారు చేయడమే కాకుండా, జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి కూడా ఎంతో ప్రత్యేక‌మైన త‌ల‌పాగాను కూడా తయారు చేస్తారు. వీటితో పాటు పెళ్లిళ్లు, మతపరమైన కార్యక్రమాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా ఆయ‌న త‌ల‌పాగాలు విక్రయిస్తుంటారు.

అయితే, కాశీనాథునికి తలపాగా తయారు చేయడం ఒక బాధ్యతతో పాటు గౌరవానికి సంబంధించిన విషయమని ఘియాసిద్దీన్ చెప్పిన‌ట్టు ఆవాజ్-ది వాయిస్ నివేదించింది. తన పూర్వీకులు ప్రారంభించిన దాని వారసత్వాన్ని కొనసాగించడం ఆయన అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపింది. ''మా ముత్తాత హాజీ చెడ్డీ ఈ కళను లక్నో నుంచి తీసుకొచ్చారు. నగరం నచ్చడంతో ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. సామరస్య భావంతో కాశీ విశ్వనాథునికి తలపాగా సమర్పించాలని నిర్ణయించగా, అర్చకులు అంగీకరించార‌ని" ఘియాసుద్దీన్ అహ్మద్ తెలిపారు. హజ్జీ చెడ్డీ కుమారుడు హాజ్జీ అబ్దుల్ గఫూర్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. అలాగే, కొన‌సాగుతూ త‌ర‌త‌రాలుగా ఈ ముస్లిం కుటుంబం కాశీ విశ్వ‌నాథునికి త‌ల‌పాగాను త‌యారు చేసి అందిస్తోంది. 

కాగా, ఘియాసుద్దీన్ కు నలుగురు కుమారులు- మన్వర్ అలీ, అబ్దుల్ సలాం, ముహమ్మద్ కలీం, ముహమ్మద్ షాహిద్ తో పాటు అతని మనవడు ముహమ్మద్ కూడా త‌ల‌పాగాలు త‌యారు చేస్తుంటారు. ఒక్కోసారి గియాసుద్దీన్ భార్య అమీనా బానో కూడా త‌ల‌పాగా త‌యారీ ప‌నుల‌కు వ‌స్తారు. "మేమందరం కలిసి తలపాగాలు తయారు చేస్తాము, ఒకరు గుడ్డ కోస్తారు, ఒకరు కుట్టుకుంటారు, మరొకరు ఒక ముక్కను అలంకరించే పనిలో ఉంటార‌ని" గియాసుద్దీన్ చెప్పారు. ఈ రాయల్ తలపాగాను పట్టు వస్త్రం, జరీ (బంగారం లేదా వెండి దారం), గోటా, కార్డ్ బోర్డ్ తో తయారు చేస్తారనీ, ఒక ముక్కను పూర్తి చేయడానికి వారం రోజులు పడుతుందని గియాసుద్దీన్ చెప్పారు. అక్బరీ తలపాగాను కాశీ విశ్వనాథుని కోసం ప్రత్యేకంగా తయారు చేశామ‌నీ, అది వెలకట్టలేనిదని ఆయన చెప్పారు. 

ఈ తలపాగాను సేవాభావంతో తయారు చేశామనీ, లాభాపేక్ష కోసం కాదని, తనకు, తన కుటుంబానికి దైవానుగ్రహం తీసుకురావాలని భావించానని చెప్పారు. "మేము భోలేనాథ్ ను తలపాగా సమర్పించడం ద్వారా సేవ చేస్తాము. మేము హిందూ-ముస్లింలను వేరుగా పరిగణించమ‌ని" తెలిపారు.