చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. డ్రగ్స్ కంపెనీలో చెలరేగిన మంటలు..
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్న ఓ డ్రగ్స్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి.
ఉత్తర చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ డ్రగ్స్ తయారీ కంపెనీలో సోమవారం ఉదయం ఒక్క సారిగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఉదయం 8:15 గంటల ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. దీంతో అగ్నిమాపక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటలు శ్రమించిన తరువాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
భవనం చుట్టు అలుముకున్న మంటల వల్ల సంస్థ సమీపంలో పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా కాలిపోయాయి. మందపాటి పొగ పొర ఆ ప్రాంతాన్ని కప్పేసింది. ఈ ఘటనపై ఫైర్ ఆఫీసర్ రాబిన్ మాట్లాడుతూ.. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదంపై తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఆరు ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి పంపించామని, దీంతో మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈ మంటలకు కారణం ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదని అన్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాబిన్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల నష్టం, కారణం ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు.