PM Modi Europe Tour:  డిజిటల్ చెల్లింపులో భారతదేశం 40 శాతం భాగస్వామ్యమని బెర్లిన్‌లో ప్రధాని మోదీ అన్నారు. భార‌త్ కు  అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2014 నాటికి భార‌త్ లో కేవ‌లం 200-400 స్టార్టప్ లు ఉంటే.. నేడు 68,000 స్టార్టప్‌లు, డజన్ల కొద్దీ యునికార్న్‌లకు నిలయంగా మారింద‌ని,  వారిలో కొందరు ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో డెకా-కార్న్స్‌గా మారార‌ని ప్ర‌ధాని  మోడీ అన్నారు.  

PM Modi Europe Tour: ప్ర‌ధాని మోడీ సోమ‌వారం బెర్లిన్ లో జ‌రిగిన క‌మ్యూనిటి కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తూ.. స్కోప్, స్పీడ్, స్కిల్ భార‌త‌దేశానికి బ‌లమ‌ని అన్నారు. భార‌త్ లో అతివేగ‌వంత‌మైన‌ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉంద‌నీ, తద్వారా డిజిట‌ల్ చెల్లింపులు వేగ‌వంతం అవుతున్నాయ‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా రోజువారిగా రూ 20000 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు సాగుతున్నాయి. ఇది ఆర్థికంగానే కాకుండా సామాజికంగా తలెత్తిన కీలక పరిణామం అయిందని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులో భారతదేశం 40 శాతం భాగస్వామ్య వాటా క‌లిగి ఉంద‌ని, ఇందుకు మెరుగైన, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండట‌మేన‌ని తెలిపారు. 

ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఈజ్ ఆఫ్ మొబిలిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా ప్రతి రంగంలోనూ కొత్త కోణాలను ఏర్పరుచుకుంటూ నేడు భారతదేశం వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంద‌ని  ప్రధాని మోదీ అన్నారు. నూత‌న‌ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని, దీని ప్రభావం భారతదేశ ఎగుమతులపై కూడా కనిపిస్తుందని అన్నారు. భార‌త దేశ‌ వస్తువులు, సేవలను పరిశీలిస్తే.. గత సంవత్సరం భారతదేశం 670 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను ఎగుమతి చేసిందని తెలిపారు. 

'మేక్ ఇన్ ఇండియా' భారతదేశానికి చోదక శక్తిగా మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. నమ్మకంగా ఉన్న భారతదేశం నేడు ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహకాల ద్వారా పెట్టుబడికి మద్దతునిస్తోందని అన్నారు.  21వ శతాబ్దపులోని రానున్న మ‌రో మూడో దశాబ్దంలో భారతదేశం గ్లోబల్‌గా మారుతుందనేది.. సత్యమని ప్రధాని మోదీ అన్నారు. కరోనా కాలంలో, భారతదేశం 150 కంటే ఎక్కువ దేశాలకు అవసరమైన మందులను పంపడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడిందని, కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో భారతదేశం విజయం సాధించింద‌ని తెలిపారు.   

గత ఎనిమిదేళ్లుగా.. భారతదేశం అన్ని రంగాలలో వేగంగా పురోగతి సాధిస్తోందని - జీవన సౌలభ్యం, జీవన నాణ్యత, ఉపాధి సౌలభ్యం, విద్య నాణ్యత, వ్యాపారం చేయడం సౌలభ్యం, ప్రయాణ నాణ్యత, ఉత్పత్తుల నాణ్యత వంటి  రంగాల్లో వృద్ధి సాధించింద‌ని తెలిపారు. 

న‌వ భార‌తం ఇప్పుడు సురక్షితమైన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదనీ, కానీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, ఆవిష్కరణలు, ఇంక్యుబేట్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. 2014 నాటికి 200-400 స్టార్టప్‌లను కలిగి ఉన్న భారత్..  నేడు 68,000 స్టార్టప్‌లు, డజన్ల కొద్దీ యునికార్న్‌లకు నిలయంగా మారింద‌ని,  వారిలో కొందరు ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో డెకా-కార్న్స్‌గా మారార‌ని  మోడీ అన్నారు. అలాగే.. భార‌త‌దేశంలో క్లైమేట్‌ ఛాలెంజ్‌ను ఎదుర్కోవ‌డానికి.. దేశ వ్యాప్తంగా అంద‌రితో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని  అన్నారు. అలాగే ఈ 21వ శతాబ్ద కాలం భారతదేశం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్ర‌ధాని తెలిపారు.