దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న ముఠాను హర్యానా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 

హర్యానాలో (haryana) భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేశారు పోలీసులు. తెలంగాణలోని (telangana) ఆదిలాబాద్‌కు (adilabad) పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న ముఠాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని కర్నాల్‌లో పాక్ ఉగ్రవాదులతో (pakistan terrorists) సంబంధం గల నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా వద్ద వాహనంలో వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు ఫిరోజ్ పూర్‌కు చెందిన వాళ్లు కాగా... ఒకరు లూధియానా వాసి. 

నిందితులను గురుప్రీత్, అమన్ దీప్, పర్మీందర్, భూపేంద్రగా గుర్తించారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు ఈ ఆయుధాలను తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరవేసేందుకు వెళ్తున్నట్లు విచారణలో చెప్పారు. హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురితో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి టచ్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను డ్రోన్‌ల సాయంతో పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌ జిల్లాకు ఆయుధాలు పేలుడు పదార్థాలు, మందుగుండు పంపుతున్నట్లు తేలింది. పాక్ జాతీయుడి ఆదేశాల మేరకు వాటిని భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది గురుప్రీత్ ముఠా. కాగా.. ఈ ముఠా గత 9 నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేశారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు ఆయుధాలను, మందుగుండను ఈ ముఠా చేరవేసింది. 

అరెస్ట్ చేసిన న‌లుగురు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ (khalistan terrorists) అయిన బ‌బ్బ‌ర్ ఖాల్సా ఇంట‌ర్నేష‌న‌ల్ (బీకేఐ) (babbar khalsa international) సంస్థ‌కు చెందిన‌వారుగా పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని ప‌ట్టుకోడానికి పంజాబ్ ఐబీ పోలీసులు, హ‌ర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు. ఈ న‌లుగురు అనుమానిత ఉగ్ర‌వాదుల వ‌య‌స్సు 20 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్య వుంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. వీళ్లు పంజాబ్ నుంచి నాందేడ్ బ‌య‌ల్దేరుతుండ‌గా హ‌ర్యానాలోని బ‌స్తారా టోల్ ప్లాజా వ‌ద్ద పట్టుబడ్డారు.