Patna: బీహార్లోని మోతిహారిలో కల్తీ మద్యం సేవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుసగా కల్తీ మద్యం కేసులు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
20 Dead After Consuming Illicit Liquor: ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. ఈ విషాదకర ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వరుసగా కల్తీ మద్యం కేసులు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకెళ్తే.. బీహార్ లో శుక్రవారం రాత్రి కల్తీ మద్యం సేవించి 20 మంది మృతి చెందగా, అరడజను మంది పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ లో మద్యంపై నిషేధం ఉంది. అయితే, ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించిన 2016 నుండి ఇలాంటి వరుస మరణాలలో చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఘటన రాష్ట్ర రాజధాని పాట్నాకు వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీహరిలోని లక్ష్మీపూర్, పహర్పూర్ హర్సిద్ధి బ్లాక్లలో ఈ మరణాలు సంభవించాయి. కల్తీ మద్యాన్ని తరలిస్తున్న ట్యాంకును మోతీహరికి తీసుకువచ్చిన కొందరు, స్థానిక వ్యాపారులకు పంపిణీ చేయడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిపై స్పందించేందుకు అక్కడి పోలీసులు, అధికార యంత్రాంగం నిరాకరించిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
కల్తీ మద్యం కారణంగా పదేపదే మరణాలు సంభవిస్తుండటంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసుకున్నాయి. అక్కడి సంకీర్ణ సర్కారుపై బీజేపీ విమర్శల దాడికి దిగింది. రాష్ట్రంలోని సరన్ జిల్లాలో విషపూరిత మద్యం కారణంగా 40 మంది మరణించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక తర్వాత ప్రతిపక్ష బీజేపీ సర్కారుపై మరింతగా విమర్శలకు పదును పెట్టింది. మరణాలకు అధికార యంత్రాంగం కారణమని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం మానవ హక్కుల కమిషన్ పర్యటనను ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆరోపించారు.
