భారత్‌లో నెమ్మదించిందని అనుకున్న కరోనా గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో కోవిడ్‌కు హాట్ స్పాట్‌గా వున్న మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ఉద్ధవ్ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించింది

భారత్‌లో నెమ్మదించిందని అనుకున్న కరోనా గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో కోవిడ్‌కు హాట్ స్పాట్‌గా వున్న మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ఉద్ధవ్ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించింది.

కాగా వషిమ్‌ జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో ఒకేసారి 190 మందికి వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. వీరిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో అధికారులు పాఠశాల పరిసరాల్ని కంటైన్‌మెంట్‌‌ జోన్‌గా ప్రకటించారు.

ఈ వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో.. ఇటీవల మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమరావతి, యావత్మల్‌ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మరణించారు. ఇటీవల దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగ భాగం మహారాష్ట్రలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 60వేలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.