జీన్స్ వేసుకుంటోందని.. మనవరాలిని చంపిన తాత..!
బాలికతో మోడ్రన్ డ్రెస్ లు వేయించడం ఆపేయమని.. సంప్రదాయ దుస్తులు వేయాలని సూచించారు. అయితే.. వారు చెప్పిన విషయం బాలికకు నచ్చలేదు.
ఆమెకు జీన్స్ వేసుకోవడం ఇష్టం. అయితే.. అది ఇంట్లో మామ, బాబాయి లకు నచ్చలేదు. వెస్ట్రన్ దుస్తులు వేసుకోవద్దని.. సంప్రదాయంగా ఉండే దుస్తులు వేసుకోవాలని చెప్పారు. అందుకు ఆ బాలిక అంగీకరించలేదు. అంతే.. కోపంతో అతి దారునంగా చంపేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమర్ నాథ్ పాశ్వాన్ అనే వ్యక్తి భార్య శకుంతలా దేవి, కుమార్తె(17) తో కలిసి ఉపాధి కోసం పంజాబ్ వెళ్లాడు. అక్కడే కొంతకాలం నుంచి ఉంటుున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి కుమార్తె కు మోడ్రన్ దుస్తులు వేసుకోవడం అలవాటుగా మారింది.
ఇటీవల శకుంతల.. తన కుమార్తె తో కలిసి మళ్లీ ఉత్తరప్రదేశ్ కి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా బాలిక అలవాటు ప్రకారం.. మోడ్రన్ వేసుకోవడం మొదలుపెట్టింది. అది బాలిక తాత పరమ్ హాన్స్ పాశ్వాన్, బాబాయిలు అరవింద్ పాశ్వాన్, వ్యాస్ పాశ్వాన్ లకు నచ్చలేదు.
ఇదే విషయాన్ని బాలిక తల్లి శకుంతలకు కూడా చెప్పారు. బాలికతో మోడ్రన్ డ్రెస్ లు వేయించడం ఆపేయమని.. సంప్రదాయ దుస్తులు వేయాలని సూచించారు. అయితే.. వారు చెప్పిన విషయం బాలికకు నచ్చలేదు. తాను తనకు నచ్చినట్లుగా వెస్ట్రన్ దుస్తులు వేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది.
ఈ క్రమంలో.. తాత, బాబాయిలతో బాలికకు పెద్ద వాగ్వాదమే చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాలిక తన బాబాయి పై చెయ్యి చేసుకుంది. అంతే.. గొడవ మరింత పెద్దదిగా మారింది. దీంతో.. ఆవేశంలో.. బాలికను గోడకేసి కొట్టారు. ఈ క్రమంలో బాలిక ప్రాణాలు కోల్పోయింది.
వెంటనే వారు బాలిక మృతదేహాన్ని ఆటోలో తీసుకొని వెళ్లి.. కాశ్యా-పాట్న హైవే బ్రిడ్జ్ పై నుంచి పడేశారు. అయితే.. మృతదేహం కిందపడే క్రమంలో.. బ్రిడ్జికి ఉన్న ఓ రాడ్డుకి పట్టుుకోవడంతో.. దానికి వేలాడింది. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్, బాలిక తాతను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాబాయిలు అరవింద్, పాశ్వాన్ ల కోసం గాలిస్తున్నారు.