మిజోరంలో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందారు.
న్యూఢిల్లీ: మిజోరంలో బుధవారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలింది. ఈ బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకుని 17 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఐజ్వాల్ కు 21 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
శిథిలాల కింద నుండి 17 మృతదేహలను వెలికి తీశారు. ఇంకా కొందరు కార్మికుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.రాష్ట్రంలోని ఐజ్వాల్ కు సమీపంలో గల సాయిరాంగ్ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. నిర్మాణంలోని వంతెన కుప్పకూలింది. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
బైరాగి-సాయిరాంగ్ కొత్త రైల్వే లైన్ కోసం వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కుప్పకూలినట్టుగా మిజోరం సీఎం జోరంతంగా పేర్కొన్నారు. ఈ దుర్ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో ఐజ్వాల్ ను కలిపేందుకు 51.38 కి.మీ. దూరం కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఎం వివరించారు.
