ఒడిశాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి.కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో ఓ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. గరద్పూర్ బ్లాక్లోని కుదనగారి హైస్కూల్ పై పిడుగు పడింది. ఈ ప్రమాదకర ఘటనలో 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను అమృత పాండా , అద్యాషా లక్ష్మి సమల్గా గుర్తించారు. చిక్సిత కోసం తొలుత పాటకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాటకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)నుండి కేంద్రపరా జిల్లా ప్రధాన ఆసుపత్రి (డిహెచ్హెచ్)కి తరలించారు.
క్షతగాత్రులంతా కుదనగారి ఆదర్శ విద్యాలయంలోని 6వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన 16 మంది విద్యార్థుల్లో 14 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన అనంతరం.. కొంతమంది విద్యార్థులు స్పృహ కోల్పోగా.. మరికొందరు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుతో తమ తరగతి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని విద్యార్ధులు చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వెంటనే గాయపడిన విద్యార్థులను పటాకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ నుండి అమృత,అద్యాషాను కేంద్రపరా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
