పుణె కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి
మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.
పుణె:మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మంటల్లో ఇద్దరు కార్మికులు చిక్కుకొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది కార్మికుల మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మరో మూడు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 17 మంది చిక్కుకొన్నారు. వీరిలో 15 మంది మహిళలు, ఇద్దరు పురుషులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడ కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో ఇవాళ సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. మొత్తం 8 ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంబవించిందని భావిస్తున్నామని ఎస్వీఎస్ అక్వా డైరెక్టర్ ఎస్వీఎస్ నీకుంజ్ షా చెప్పారు.