జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రమాదం జరిగింది. భక్తుల రద్దీ కారణంగా శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట‌లో 12 మంది మృతి చెందారు. మ‌రో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. 

జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా శనివారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట‌లో 12 మంది మృతి చెందారు. మ‌రో 20 మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట గర్భగుడి వెలుపల గేట్ నంబర్ 3 సమీపంలో జరిగింది.ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో ఆయన సంతాపం తెలిపారు. ‘‘ మాతా వైష్ణో దేవి భవన్‌లో తొక్కిసలాట జరగడం వల్ల ప్రాణ నష్టం జరగడం బాధించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

కారును పళ్లతో లాగుతూ.. బీభత్సం సృష్టించిన పులి... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...

ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్న ప్ర‌ధాని..
మాతా వైష్ణో దేవి మందిరంలో తొక్కిసలాట, బాధితుల చికిత్స‌, స‌హాయ‌క కార్య‌క్ర‌మాల ప‌రిస్థితిని ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్విట్ట‌ర్‌లో తెలిపారు. గాయ‌ప‌డిన‌ వారికి వేగంగా మెరుగైన చికిత్స అందించాల‌ని, స‌హాయాక కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌ధాని ఆదేశించిన‌ట్టు తెలిపారు. బాధిత కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేశార‌ని చెప్పారు. ఈ ఘటన విషయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలియ‌జేశారు. ఈ తొక్కిస‌లాట‌పై ప్ర‌భుత్వం ఉన్న‌త స్థాయి విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) నేతృత్వం వహిస్తారు. ఏడీజీపీ, జమ్మూ, డివిజనల్ కమిషనర్ స‌భ్యుడిగా ఉంటారు. 

మృతుల కుటుంబాల‌కు 12 ల‌క్ష‌ల సాయం..
మాతా వైష్ణో దేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు పీఎంఎన్ఆర్ఎఫ్ (PMNRF) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయప‌డిన వారికి రూ.50,000 చొప్పున అంద‌జేస్తామ‌ని ఇది వ‌ర‌కే ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. దీనితో పాటు జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం కూడా మృతుల కుటుంబాల‌కు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. ఈ మేర‌కు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకట‌న విడుద‌ల చేశారు. 

డెల్టాను రీప్లేస్ చేస్తూ.. అంతర్జాతీయ ప్రయాణికుల పాజిటివ్ కేసుల్లో 80 శాతం ఒమిక్రానే...

గాయ‌ప‌డిన వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మం..
ఈ ఘ‌ట‌న‌లో 20 మంది గాయ‌ప‌డ‌గా.. వారంద‌రూ ప్ర‌స్తుతం మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో న‌లుగురి ప‌రిస్థితుల్లో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతదేహాల‌ను క‌త్రా బేస్ క్యాంప్‌లోని త‌ర‌లించారు. 12 మంది మృతుల్లో ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్‌, జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు ఉన్నార‌ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ గోపాల్ దత్ తెలిపారు. 

కాల్ సెంట‌ర్లు ఏర్పాటు..
జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయ తొక్కిసలాట ఘ‌ట‌న నేప‌థ్యంలో కాల్ సెంట‌ర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్ర‌మాద బాధితుల‌కు చికిత్స‌, స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు - 01991-234804, 01991-234053, పీసీఆర్ క‌త్రా - 01991232010, 9419145182, పీసీఆర్ రియాసి - 0199145076, 9622856295, డీసీ ఆఫీస్ రియాసీ కంట్రోల్ రూమ్ - 01991245763/ 9419839557 నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.