సారాంశం
మహారాష్ట్రలో నాందేడ్లోని ప్రభుత్వ హాస్పిటల్లో 8 రోజుల్లో 108 మంది పేషెంట్లు మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 11 మంది మరణించారు.
ముంబయి: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లు పెద్ద మొత్తంలో మరణించారు. కేవలం 8 రోజుల్లోనే 108 మంది రోగులు మరణించారు. సెప్టెంబర్ చివరిలో అక్టోబర్ మొదట్లో 48 గంటల్లోనే 31 మంది పేషెంట్లు మరణించారు. వీటికి అదనంగా గత 8 రోజుల్లో 108 మంది పేషెంట్లు మరణించారు. గడిచిన 24 గంటల్లోనే ఒక శిశువు సహా 11 మంది పేషెంట్లు మరణించడం గమనార్హం.
ఈ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆ హాస్పిటల్ సేవలపై అనుమానాలను రేపాయి. ఆ హాస్పిటల్లో ఔషధాల కొరత ఉన్నదని ఆరోపణలు వచ్చాయి. నాందేడ్లోని డాక్టర్ శంకర్ రావు చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డీన్ శ్యామ్ వాకోడ్ మాట్లాడుతూ.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. హాస్పిటల్లో మెడిసిన్స్ కొరత ఏమీ లేదని స్పష్టం చేశారు.
Also Read: బైక్ పై యువ జంట రొమాన్స్.. ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోతూ.. పోలీసులు ఏం చేశారంటే? (వీడియో)
గడిచిన 24 గంటల్లో 1,100 మంది పేషెంట్లను వైద్యులు చికిత్స అందిస్తున్నారని, 191 మంది కొత్త పేషెంట్లను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నట్టు డీన్ వివరించారు. గతంలో ఒక రోజులో 13 మంది మరణించే రేటు ఉండేదని, ఇప్పుడు ఇది 11 మరణాలకు తగ్గిందని వివరించడం విస్మయకరంగా ఉన్నది. ఈ మరణాల్లో నవజాత శిశువులు, కొన్ని సమస్యలతో పుట్టిన శిశువులు ఉన్నారని వివరించారు. కనీసం మూడు నెలలకు సరిపడా మెడిసిన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటామని చెప్పారు. మెడిసిన్స్ కొరతతో ఎవరూ మరణించలేదని వివరించారు. చాలా మంది వారి ఆరోగ్య పరిస్థితులు విషమించి చనిపోయినట్టు పేర్కొన్నారు.