దక్షిణాదిపై మోడీ ఫోకస్: వారణాసితో పాటు బెంగళూరు నుంచి పోటీ..?
ప్రధాని నరేంద్రమోడీని దక్షిణ భారతదేశంలోని ఏదో ఒక ముఖ్యమైన నగరం నుంచి బరిలోకి దించాలని కాషాయ దళం వ్యూహం. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మరోసారి రెండు చోట్లా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ ఆ వ్యూహంలో భాగంగా ఈ ప్రాంతం నుంచి అగ్రనేతలను పోటీకి దించాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీని దక్షిణ భారతదేశంలోని ఏదో ఒక ముఖ్యమైన నగరం నుంచి బరిలోకి దించాలని కాషాయ దళం వ్యూహం.
అందుకు తగ్గట్టుగానే ప్రధాని మరోసారి రెండు చోట్లా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకటి వారణాసి కాగా, రెండోది బెంగళూరు అంటూ చర్చ నడుస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తర, దక్షిణ దేశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కమలనాథుల భావన.
బీజేపీకి కంచుకోటగా ఉన్న బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మోడీని పోటి చేయించాలని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర్ రావుతో చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు బెంగళూరు దక్షిణ నుంచి తేజస్విని అనంతకుమార్ను పోటీ చేయించాలని రాష్ట్ర పార్టీ నేతలు అధిష్టానానికి తెలిపారు. మోడీ కోసం ఈ స్థానానికి ఇంత వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు.
ఒకవేళ ఈ స్థానం నుంచి మోడీ బరిలోకి దిగితే.. ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ల ఉమ్మడి అభ్యర్థిగా మంత్రి డీకే శివకుమార్ను రంగంలోకి దించే అవకాశం ఉంది.