పోలింగ్ టైం మార్చండి: ఈసీకి సుప్రీం ఆదేశం
ఎన్నికల వేళలు మార్చాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్ను ఆదేశించింది.
ఎన్నికల వేళలు మార్చాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్ను ఆదేశించింది. రంజాన్ నెల ప్రారంభమవుతుందన్న కారణంగా విపరీతమైన ఎండ వేడిమి, రంజాన్ నెల కారణంగా ముస్లిం ఓటర్లు క్యూలైన్లో నిలబడటం కష్టమని, కనుక పోలింగ్ వేళల్లో మార్పులు చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వివిధ ముస్లిం సంస్ధలు, రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీం.. ఈసీనీ ఆదేశించింది.
మార్చి 10న ఎన్నికల తేదీలను ప్రకటించగానే.. ఈ తేదీలు రంజాన్ నెల ఒకేసారి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. రంజాన్ రోజు, శుక్రవారాలను పోలింగ్ షెడ్యూల్ నుంచి మినహాయించామని ఈసీ వివరణ ఇచ్చింది.
మొత్తం నెలను మార్చలేమని స్పష్టం చేసింది. మే 6,12,19 తేదీల్లో జరిగే చివరి మూడు దశల ఎన్నికలు.. రంజాన్ నెలలోనే జరగనున్నాయి.