వరుణ్ గాంధీ వర్సెస్ వరుణ్ గాంధీ: వరుసగా రెండోసారి
ఎన్నికల్లో ఒకే పేరుతో అభ్యర్థులు బరిలో ఉండటం చూస్తూ ఉంటాం. ప్రత్యర్థులను ఓడించాలని కొందరు ఏకంగా వెతికి మరి ఒకే పేరున్న వారిని బరిలోకి దించుతారు
ఎన్నికల్లో ఒకే పేరుతో అభ్యర్థులు బరిలో ఉండటం చూస్తూ ఉంటాం. ప్రత్యర్థులను ఓడించాలని కొందరు ఏకంగా వెతికి మరి ఒకే పేరున్న వారిని బరిలోకి దించుతారు. వాళ్ల సంగతి ఏమో కానీ ఈ చర్య వల్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
బీజేపీ యువ ఎంపీ వరుణ్ గాంధీ.. తన పేరున్న మరో అభ్యర్థి వల్ల గత ఎన్నికల్లో 14 వేల ఓట్లు కోల్పోయారు. 2014 ఎన్నికల్లో వరుణ్ గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేశారు. అతనిపై పోటీకి వరుణ్ గాంధీ అనే స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు.
ఎన్నికల సంఘం ఆయనకు గోభీ పువ్వును గుర్తుగా కేటాయించింది. ఆ సమయంలో అతను రెండు రోజులు మాత్రమే ప్రచారం చేయగా.. 14 వేల 21 ఓట్లు రావడం విశేషం. దీనిపై అతను మాట్లాడుతూ... 2012లో తాను వరుణ్ గాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని, ఎన్నిసార్లు ప్రయత్నించినా అతనిని కలవడం కుదరలేదని తెలిపాడు.
అందుకే వరుణ్ గాంధీపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తాజాగా మరోసారి పీలీభీత్ నుంచి వరుణ్పై వరుణ్ పోటీకి నిలిచారు. ఎన్నికల సంఘం మరోసారి ఇతనికి గోభీ పువ్వు గుర్తును కేటాయించింది.
ఏప్రిల్ నుంచి ఫీలీభీత్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు వరుణ్. అతనికి సాయంగా 9 మంది స్నేహితులు కూడా అక్కడికి వెళ్లారు. ఇతను మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది... రెవాడీలో హోటల్ నడుపుతున్నాడు. ఈ ఎన్నికలు ఈ వరుణ్... అసలు వరుణ్కు ఏ స్థాయిలో నష్టం కలిగించబోతున్నాడోనని అక్కడి జనం చర్చించుకుంటున్నారు.